ఇటీవల టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా ఊపందుకున్న సంగతి తెలిసిందే. పాత సినిమాలను 4కె ప్రింట్లకు అప్డేట్ చేసి థియేటర్లలో రిలీజ్ చేస్తుంటే కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆ మధ్య విడుదలైన `పోకిరి`, `జల్సా` చిత్రాలు ఎలాంటి రికార్డులు సృష్టించాయో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పనిలేదు.
ఇక ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన `చెన్నకేశవరెడ్డి` చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టబు, శ్రియా హీరోయిన్లుగా నటించారు. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రం 2002 సెప్టెంబర్ 25న విడుదలైన బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
అయితే నేటితో ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో ఈ మూవీని సెప్టెంబర్ 24, 25 తేదీల్లో భారీ ఎత్తున రీ రిలీజ్ చేశారు. ముఖ్యంగా అమెరికాలో శనివారం సుమారు 40 లొకేషన్లలో `చెన్నకేశవ రెడ్డి` విడుదల అవగా.. అక్కడ ఈ చిత్రానికి విశేష ఆధరణ లభించింది.
దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల రీ రిలీజ్ అయిన మహేశ్ `పోకిరి`, పవన్ కళ్యాణ్ `జల్సా` రికార్డు కలెక్షన్స్ను చిత్తు చిత్తు చేశాడు బాలయ్య. అవును అమెరికాలో `చెన్నకేశవ రెడ్డి`కి 45,000 డాలర్లు వచ్చాయి. పైగా ఇది 36 లొకేషన్స్ కలెక్షన్స్ మాత్రమే. మహేష్ బాబు `పోకిరి`కి 16,000 డాలర్లు వస్తే..పవన్ కళ్యాణ్ `జల్సా`కు 38,000 డాలర్లు వచ్చాయి. ఈ లెక్కన రీ రిలీజ్ సినిమాల్లో హయ్యస్ట్ రికార్డ్ బాలయ్య చెన్నకేశవరెడ్డి సినిమాదే అని చెప్పొచ్చు.