ఈ దసరా పండుగకు బాక్సాఫీస్ వద్ద సీనియర్ హీరోల సినిమాలు సందడి చేసిన సంగతి తెలిసిందే. అందుకు మెగాస్టార్ చిరంజీవి నటించిన `గాడ్ ఫాదర్` ఒకటి. కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానిక తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించారు.
ఇందులో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సముద్రఖని, సునీల్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఆగస్టు 5న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై.. పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ కు రీమేక్ అయినప్పటికీ.. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.
దీంతో చిరంజీవి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లతో దుమ్ము దులిపేస్తున్నాడు. రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లను క్రాస్ చేసిందంటే.. ఈ మూవీ ఏ రేంజ్లో అదరగొడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
`గాడ్ ఫాదర్` డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దాదాపు రూ. 60 కోట్లు చెల్లించి ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే `గాడ్ ఫాదర్`కు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వస్తుండటంతో.. ఈ చిత్రాన్ని ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో దింపాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే డిసెంబర్ వరకు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశాలు లేనట్లే.