ఈ దసరా పండక్కి టాలీవుడ్ సీనియర్ స్టార్స్ చిరంజీవి, నాగార్జున బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి నుంచి రాబోతున్న చిత్రం `గాడ్ ఫాదర్`. కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించాడు.
ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్, పూరీ జగన్నాథ్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మలయాళ సూపర్ హిట్ `లూసిఫర్`కు రీమేక్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం అక్టోబర్ 5న తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల కాబోతోంది.
మరోవైపు నాగార్జున `ది ఘోస్ట్` మూవీతో వస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటి గుల్ పనాగ్, అనిఖా సురేంద్ర తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా సైతం అక్టోబర్ 5వ తేదీనే రిలీజ్ కాబోతోంది. అయితే `గాడ్ ఫాదర్`, `ది ఘోస్ట్` చిత్రాల మధ్య ఓ పోలిక ఉంది.
అదేంటంటే.. ఈ రెండు చిత్రాలు సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కినవే. `గాడ్ ఫాదర్`లో పొలిటికల్ ట్రబుల్స్ ఫేస్ చేస్తున్న చెల్లెలు తరపున చిరంజీవి, `ది ఘోస్ట్`లో టెర్రరిస్ట్ల దాడి నుండి తన సోదరిని కాపాడేందుకు ఇంటర్పోల్ ఆఫీసర్గా నాగార్జున కనిపించబోతున్నారు. ఈ రెండు సినిమాల ప్రధాన పాయింట్ ఒకటే. అయితే ఎవరి సినిమా ముందు విడులైనా.. తర్వాత రిలీజ్ అయ్యే సినిమాతో పోలికలు మొదలెడతారు. ఈ కారణంగానే చిరు, నాగ్లు వెనక్కి తగ్గకుండా ఒకే రోజు వచ్చేందుకు సిద్ధమయ్యారని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.