టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం రాజమౌళి చేస్తున్న చిత్రమిది. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఈ మూవీకి కథ అందిస్తున్నారు.
హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత కె.ఎల్ నారాయణ నిర్మించబోతున్నారు. ఇదో యాక్షన్ అడ్వెంచరస్ మూవీ అని ఇప్పటికే రాజమౌళి స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చిన నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ కోసం జక్కన్న ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పై కన్నేశారట. ఆ హీరోయిన్ మరెవరో కాదు దీపికా పదుకొనే. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్కు జోడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వం లో `ప్రాజెక్ట్ కె` సినిమాలో నటిస్తోంది.
అయితే మహేష్ కు జోడీగా దీపికా బాగా సూట్ అవుతుందని రాజమౌళి భావిస్తున్నారట. పైగా ఆమెకు ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమెను హీరోయిన్గా ఎంపిక చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్కు దీపికా ఓకే చెబుతుందా..? లేదా..? అన్నది తెలియాల్సి ఉంది.