పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన తాజా చిత్రం `ఆదిపురుష్`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని టి. సిరీస్ బ్యానర్పై భూషణ్కుమార్, క్రిషన్కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్నారు.
ఇందులో ప్రభాస్, కృతి సనన్ సీతారాములుగా కనిపించబోతున్నారు. అలాగే సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా టీజర్ ను బయటకు వదిలారు. అయితే ఈ టీజర్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. మరెన్నో ట్రోల్స్ వచ్చాయి.
అయితే తాజాగా టీజర్ వల్ల ఆదిపురుష టీంకు కొత్త చెక్కులు ఏర్పడ్డాయి. ఇటీవల ఓ సంస్థ ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆదిపురుష్ టీజర్ హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందని.. రాముడు, సీత, రావణుడిని చూపించిన విధానం సరిగా లేదని ఆరోపించారు. వాస్తవ పాత్రలు కాకుండా ఇస్లామికరణంగా ప్రజెంట్ చేశారని, హిందూ గ్రంథమైన రామాయణం అసలు పాత్రలను సాంస్కృతిక విలువలను ఆదిపురుష్ సభ్యులు దెబ్బతీశారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే `ఆదిపురుష్` సినిమా విడుదలపై స్టే విధించాలంటూ సదర సంస్థ కోర్టును కోరింది. అయితే ఈ పిటీషన్ పై సోమవారం విచారణ చేపట్టాలని ఢిల్లీ హైకోర్టు.. ఆదిపురుష్ టీమ్కు ఊహించని షాక్ ఇచ్చింది. హీరో ప్రభాస్ తో సహా చిత్ర టీమ్ మొత్తానికి నోటీసులు జారీ చేసింది. మరి ఈ నోటీసులపై చిత్ర టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.