పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో `హరిహర వీరమల్లు` అనే మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పవన్ తన కెరీర్లోనే తొలిసారి చేస్తున్న పీరియాడిక్ మూవీ ఇది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంటే..బాలీవుడ్ స్టార్స్ నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. గత ఏడాదే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. ఇప్పటికీ షూటింగ్ను కంప్లీట్ చేసుకోలేదు. మొదటి నుంచి ఈ సినిమా చిత్రీకరణకు వరుస అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి.
దాంతో ఈ సినిమా ఆగిపోయిందని, ఇక ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమే అని ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా పుకార్లకు చెక్ పెడుతూ `హరిహరి వీరమల్లు`పై నిర్మాత ఏఎం రత్నం అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. రిలీజ్ కూడా ప్రకటించారు. ఈ రోజుల మీడియా కంటపడ్డ ఆయన్ను `వీరమల్లు` గురించి రిపోర్టర్లు ప్రశ్నించారు.
అందుకు ఆయన బదులిస్తూ.. `హరిహర వీరమల్లు చాలా బిగ్ బడ్జెట్ ఫిల్మ్. అందరూ అనుకుంటున్నట్లు ఈ సినిమా ఆగిపోలేదు. చిత్రం కొనసాగుతోంది. సినిమాపై వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలే. అన్నీ కుదిరితే సినిమాను వచ్చే ఏడాది 2023 మార్చి 10న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని భావిస్తున్నాం. అలాగే ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నాం. ఇది కళ్యాణ్ రామ్ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుంది` అంటూ చెప్పుకొచ్చారు.