విభిన్న చిత్రాలకు కేరాఫ్గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. రీసెంట్గా `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ `కార్తికేయ`కు సీక్వెల్ ఇది. చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నిఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా.. ఎన్నో వాయిదాల తర్వాత ఆగస్టు13న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి మొదటి షో నుండే పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. శ్రీ కృష్ణుడు, హిందుత్వం, ద్వారక నగరం గురించి అన్వేషణ లాంటి అంశాలు కార్తికేయ2 విశేషంగా ఆకట్టుకున్నాయి. దాంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటోంది.
కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయిన ఈ చిత్రం.. ఆరు రోజుల్లో రూ. 10 కోట్లకు పైగా లాభాలతో దూసుకెళ్తోంది. ఇకపోతే ఈ చిత్రం సౌత్లోనే కాదు.. నార్త్లోనూ దుమ్ముదులిపేస్తోంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని బాలీవుడ్లో ఏదో సరదాగా యాబై థియేటర్స్లో విడుదల చేశారు. అక్కడ ఎలాంటి ప్రమోషన్స్ కూడా చేయలేదు.
అయినాసరే టాక్ బాగుండటం, కంటెంట్ కనెక్ట్ అయ్యేలా ఉండటంతో.. నార్త్ ప్రేక్షకులు రీసెంట్ గా విడుదలైన బాలీవుడ్ సినిమాలు `లాల్ సింగ్ చద్దా`, `రక్షాబంధన్` లను పక్కన పెట్టి మరీ `కార్తికేయ 2` వైపు అడుగులు వేస్తున్నారు. దాంతో ఈ మూవీకి థియేటర్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. రెండో రోజుకు 200 థియేటర్స్, ఆ తర్వాత 700 థియేటర్స్ లో ఆడగా.. శుక్రవారం నాటికి వెయ్యికి పైగా స్క్రీన్లలో ‘కార్తికేయ 2’ సినిమా ప్రదర్శిస్తున్నారు. ఈ మూవీ హవాను చూసి బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఆశ్చర్యపోతున్నారు.