టాలెంటెడ్ హీరో నిఖిల్, డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం `కార్తికేయ 2`. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ `కార్తికేయ`కు ఇది సీక్వెల్. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, ఆదిత్యా మీనన్ తదితరులు కీలక పాత్రను పోషించారు.
ద్వాపర యుగానికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ ఈ కథ సాగుతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 13న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మేకర్స్.. తాజాగా `కార్తికేయ 2` ట్రైలర్ను బయటకు వదిలారు.
`ఐదు సహస్రాల ముందే పలికిన ప్రమాదం.. ప్రమాదం లిఖితం, పరిష్కారం లిఖితం` అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ విశేషంగా ఆకట్టుకుంది. `నా వరకు రానంత వరకే సమస్య నా వరకు వచ్చాక అది సమాధానం` అని నిఖిల్, `ఈ ప్రయాణంలో ప్రకృతి అడుగడుగునా పరీక్ష పెడుతుంది.. ఈ కార్యానికి వైద్యుడు అయిన శ్రీకృష్ణుడు ఎంచుకున్న మరో వైద్యుడు నువ్వే` అంటూ అనుపమ్ ఖేర్ పలికిన డైలాగ్స్ మరింత ఆసక్తిని పెంచింది.
విజువల్స్, బ్రాక్ గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్ చూసిన సినీ ప్రియులు నిఖిల్కు మరో హిట్ ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నాయి. మొత్తానికి ట్రైలర్తోనే అంచనాలను పెంచేసిన నిఖిల్.. ఆగస్టు 13న ఆ అంచనాలను అందుకుంటాడో..లేదో.. చూడాలి.