కృతి శెట్టి.. ఈ అందాల భామ గురించి పరిచయాలు అవసరం లేదు. సుకుమార్ ప్రియు శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన `ఉప్పెన`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి, తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఆ వెంటనే ఈ అమ్మడు చేసిన `శ్యామ్ సింగరాయ్`, `బంగార్రాజు` చిత్రాలు కూడా సూపర్ హిట్స్గా నిలిచాయి.
ఇంకేముంది కృతి శెట్టిని అందరూ లక్కీ హీరోయిన్ అని, ఆమె ఉంటే ఏ సినిమా అయినా హిట్టే అని ఆకాశానికి ఎత్తేశారు. దాంతో కృతి శెట్టి డేట్స్ కోసం నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కట్టారు. ఇక వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు వరుస ఫ్లాపుల్లో మునిగిపోయింది.
గత నెలలో కృతి శెట్టి `ది వారియర్`తో ప్రేక్షకులను పలకరించింది. రామ్ హీరోగా, కోలీవుడ్ డైరెక్టర్ ఎన్.లింగుసామి తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఈ సినిమాతో తొలి ఫ్లాప్ను మూటగట్టుకున్న కృతి.. రీసెంట్గా `మాచర్ల నియోజకవర్గం`తో వచ్చింది.
ఇందులో నితిన్ హీరో కాగా.. ఎం. ఎస్. రాజశేఖర్ రెడ్డి ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో కృతి శెట్టి ఖాతాలో వరసగా మరో ఫ్లాప్ పడింది. ఈ నేపథ్యంలోనే కృతి శెట్టి కీలక నిర్ణయం తీసుకుందట. ఇకపై కథ, తన పాత్ర పాధాన్యత మరియు రెమ్యునరేషన్.. ఇలా అన్ని విషయాలను బేరీజు వేసుకున్నాకే సినిమాకు సైన్ చేయాలని ఆమె నిర్ణయించుకుందట. వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ను ఒప్పుకునేకంటే.. పక్కా హిట్ అవుతుందని పూర్తి నమ్మకం కలిగించే చిత్రాలనే చేయాలనుకుంటుందట.