SSMB 28: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ మరియు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ తిరుగులేనిది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా రెండు కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. “అతడు”లో సైలెంట్ మహేష్ బాబుని చూపించగా “ఖలేజా”లో… మహేష్ లో ఉన్న కామెడీ హ్యూమర్ నీ అద్భుతంగా స్క్రీన్ మీద చూపించారు. ఖలేజా తర్వాత మహేష్ ఎంచుకున్న సినిమాలు అతని కెరీర్ కి చాలా ప్లస్ అయ్యాయి. ఎందుకంటే ఖలేజా ముందు మహేష్ పెద్దగా కామెడీ చేయడన్న టాక్ ఉండేది. కానీ ఖలేజా తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది.
ఈ రకంగా మహేష్ బాబులో రెండు సినిమాలలో వైవిధ్యమైన నటన కోణాలను చూపించిన డైరెక్టర్ త్రివిక్రమ్ ఇప్పుడు మూడో సినిమా చేస్తున్న నేపథ్యంలో అభిమానులు “SSMB 28” పై చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేస్తుంది. ఆ సమయంలో ఏప్రిల్ 28వ తారీకు సినిమా రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. అయితే అనంతరం సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో పాటు హీరోయిన్ పూజ హెగ్డే కాలికి గాయం కావడంతో… సెకండ్ షెడ్యూల్ ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు. సంక్రాంతి తర్వాత స్టార్ట్ కానుందని సమాచారం.
ఈ క్రమంలో సినిమా విడుదల తేదీకి సంబంధించి నిర్మాత నాగ వంశీ కొత్త తేదీ తెలియజేశారు. ఆగస్టు 11వ తారీకు “SSMB 28” విడుదల కానుంది అని తెలిపారు. అంతేకాదు సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డేతో పాటు శ్రీలీలా కూడా నటిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈనెల 18 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని పేర్కొన్నారు. సెకండ్ షెడ్యూల్ ఏకధాటిగా 60 రోజులు పాటు జరగనుందని సమాచారం. ఈ షెడ్యూల్ నుండి పూజ హెగ్డే జాయిన్ కానుంది అంట. మొదటి షెడ్యూల్ లో సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.