ఇటీవల `బింబిసార` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని మళ్లీ సూపర్ ఫామ్లోకి వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్.. ప్రస్తుతం సినిమాల పరంగా యమా జోరు చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే రీసెంట్గా తన 19వ చిత్రాన్ని ప్రకటించారు. రాజేంద్రరెడ్డి అనే కొత్త వ్యక్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై `ఎన్కెకెఆర్ 19` అనే వర్కింగ్ టైటిల్ తో నిర్మితమైన ఈ చిత్రం.. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఇటీవలె గోవా షెడ్యూల్ను సైతం పూర్తి చేసుకుంది.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి రెండు క్రేజీ అప్డేట్స్ నెట్టింట వైరల్గా మారాయి. అవేంటంటే.. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడట. కళ్యాణ్ రామ్ మూడు పాత్రలను పోషించడం కెరీర్ లో ఇదే తొలిసారి. అయితే ఈ మూడు పాత్రలు కూడా దేనికదే ప్రత్యేకతను సంతరించుకుని ఆకట్టుకుంటాయని అంటున్నారు.
ఇక మరో అప్డేట్ ఏంటంటే.. ఈ చిత్రానికి `ఎమిగోస్` అనే డిఫరెంట్ టైటిల్ ను ఖరారు చేశారట. కథాపరంగా ఈ సినిమాకి ఎమిగోస్ అనే టైటిల్ ను పెట్టారని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని జోరుగా ప్రచారం జరుగుతుండటంతో.. ఫ్యాన్స్ ఈ రెండు అప్డేట్స్ పట్ల ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు.