నిఖిల్: విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ `కార్తికేయ`కు ఇది సీక్వెల్. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. శ్రీకృష్ణుని చరిత్ర, ద్వారకా నగరం మీద అన్వేషణ నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 13న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై భారీ హైప్ను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే నిఖిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఎన్నో విశేషాలను షేర్ చేసుకున్నాడు. అలాగే షూటింగ్ సమయంలో పడిన కష్టాలను కూడా నిఖిల్ వివరించాడు.
నిఖిల్ మాట్లాడుతూ.. `కథ డిమాండ్ చేయడం వల్ల మేము గుజరాత్ పరిసర ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చింది. కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడం కోసం సముద్రంలోకి కూడా వెళ్లాము. మేము ఏయే ప్రదేశాలలో షూట్ చేశామో .. ఎక్కడ ఎన్నెన్ని కష్టాలు పడ్డామో చెబితే ఎవరూ కూడా అక్కడికి షూటింగులకు వెళ్లరు. ఎక్కడా కూడా ఉండటానికి సరైన హోటల్స్ లేవు .. కనీసం తినడానికి సరైన ఫుడ్ కూడా ఉండేదు కాదు. అయితే సినిమా అవుట్ పుట్ చూశాక.. చిత్రీకరణ సమయంలో పడ్డ కష్టాలన్నీ మరచిపోయాము.` అంటూ చెప్పుకొచ్చారు.