ప్రియాంకా అరుళ్ మోహన్.. ప్రస్తుతం కోలీవుడ్లో మార్మోగిపోతున్న పేరిది. నాని`గ్యాంగ్ లీడర్` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రియాంక మోహన్.. ఆ వెంటనే శర్వానంద్ కు జోడిగా `శ్రీకారం` మూవీలో మెరిసింది. కానీ ఈ రెండు చిత్రాలు ఆమెకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ఆ తర్వాత కోలీవుడ్కు మఖాం మార్చిన ఈ బ్యూటీ.. శివ కార్తికేయన్కు జోడిగా `డాక్టర్` మూవీలో నటించింది.
2021 లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. `వరుణ్ డాక్టర్` పేరుతో ఈ సినిమాని తెలుగులో విడుదల చేయగా.. ఇక్కడ సైతం మంచి విజయం సాధించింది. ఈ మూవీ అనంతరం మళ్లీ శివ కార్తికేయన్ తోనే `డాన్` మూవీ చేసింది. ఈ సినిమా సైతం తమిళ, తెలుగు భాషల్లో సూపర్ హిట్ అయ్యింది.
వరుసగా రెండు హిట్లు పడడంతో ప్రియాంకకు కోలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి అక్కడ వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. కోలీవుడ్లో కెరీర్ పరంగా యమ జోరు చూపిస్తున్న ప్రియాంక.. తాజాగా మరో బంపర్ ఆఫర్ పట్టేసింది. స్టార్ హీరో ధనుష్ కు జోడిగా ఈ ముద్దుగుమ్మ అలరించబోతోంది.
ధనుష్ హీరోగా తమిళంలో `కెప్టెన్ మిల్లర్` అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ధనుష్ కు జోడీగా ప్రియాంక మోహన్ ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కొద్ది సేపటి క్రితమే అధికారిక పోస్టర్ ద్వారా కన్ఫామ్ చేశారు. రూ. 100 కోట్ల బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక ఇటు తెలుగు లో ప్రియాంక రవితేజకు జోడీగా `రావణాసుర` సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా ఆమె చేతిలో ఉన్నాయి.
https://www.instagram.com/p/Cir_5xhJWH7/?utm_source=ig_web_copy_link