ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప ది రైజ్`. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తే.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
తెలుగులోనే కాదు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అంచనాలకు మించి రికార్డులు సృష్టించి సిల్వర్ స్క్రీన్ను ఓ రేంజ్లో షేక్ చేసింది. ఇక ఇప్పుడు ఈ మూవీకి `పుష్ప ది రూల్` టైటిల్తో పార్ట్ 2 రాబోతోంది. ఫిబ్రవరిలో ఇది పట్టాలెక్కాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల ఆలస్యమవుతూనే ఉంది.
అయితే ఎట్టకేలకు పుష్పరాజ్ బరిలోకి దిగుతున్నాడు. తాజాగా బన్నీ ఫ్యాన్స్ ను ఖుషీ చేసే గుడ్న్యూస్ ఒకటి ఈ మూవీ నుంచి బయటకు వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. `పుష్ప ది రూల్`ను రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నారు. సోమవారం చిత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మేకర్స్ కొద్ది సేపటి క్రితమే ప్రకటించారు.
దేశం అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న సీక్వెల్ను భారీస్థాయిలో తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఈ అప్డేట్తో బన్నీ ఫ్యాన్స్ మస్తు ఖుషీ అయిపోతున్నారు. ఇక సెప్టెంబర్ తొలి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోందని అంటున్నారు.