ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తే.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ మెయిన్ విలన్గా నటించారు. అలాగే సునీల్, అనసూయ, అజయ్ ఘోష్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 17న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా నార్త్లో బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ పరంగా ప్రభంజనం సృష్టించింది. ప్రస్తుతం సుకుమార్, బన్నీ ఇద్దరూ `పుష్ప 2`పై దృష్టి సారించారు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ను స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇలాంటి తరుణంలో `పుష్ప` ఒక ఫ్లాట్ మూవీ అంటూ ప్రముఖ దర్శకుడు తేజ గుట్టంతా బట్టబయలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే పుష్ప సినిమా గురించి ప్రస్తావన రాగా.. తేజ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతా చెప్పుకుంటున్నట్లు పుష్ప చిత్రం హిట్ కాదని తేజ తేల్చేశారు.
తెలుగులో చాలా ఏరియాల్లో బయ్యర్లకి పుష్ప చిత్రం భారీ లాస్ మిగిల్చిందని, నార్త్లో మంచి కలెక్షన్స్ను రాబట్టడం వల్ల ఈ సినిమా హిట్ అంటున్నారంటూ తేజ వ్యాఖ్యానించారు. దీంతో తేజ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై బన్నీ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.