మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `ఆర్ఆర్ఆర్` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్ తో ప్రారంభించిన సంగతి తెలిసిందే. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి, సునీల్, జయరామ్, శ్రీకాంత్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం.. ఇప్పటికే యాబై శాతం షూటింగ్ను కంప్లీట్ చేసుకుంది. మిగిలిన భాగాన్ని కూడా త్వరగా ఫినిష్ చేయాలనుకున్నారు. అయితే, ఇంతలోనే టాలీవుడ్లో నెలకొన్న సమస్యలు పరిష్కారమయ్యేవరకు ప్రొడ్యూసర్ గిల్డ్ బంద్కు పిలుపునిచ్చింది. మరోవైపు డైరెక్టర్ శంకర్ ఆగిపోయిన `ఇండియన్ 2`పై మళ్లీ దృష్టి సారించారు.
సెప్టెంబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ను రీస్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. `ఇండియన్ 2` పూర్తి కావడానికి మరో మూడు నెలలైనా పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ టైమ్ వేస్ట్ చేయడం ఇష్టంలేక.. ఈ గ్యాప్లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్టాన్ చేస్తున్నారట. చరణ్ తన 16వ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. మొదట శంకర్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే గౌతమ్ తిన్ననూరి చిత్రాన్ని మొదలుపెట్టాలని రామ్ చరణ్ భావించాడు.
కానీ, అనివార్య కారణాల వల్ల `ఆర్సీ 15`కి బ్రేక్ రావడంతో `ఆర్సీ 16`ను షురూ చేయాలని చరణ్ నిర్ణయించుకున్నాడట. పోస్ట్ ప్రొడెక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి సెట్స్ మీదకు వెళ్లబోతోందని టాక్ నడుస్తోంది. దీంతో చరణ్ ప్లానింగ్ అదుర్స్ అని, ఆయన చూసి మిగిలిన హీరోలు నేర్చుకోవాల్సిందే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.