టాలీవుడ్ బడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోషల్ మీడియా వేదికగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఓ రేంజ్లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట దిల్ రాజు పేరు మారుమోగిపోతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. `ఆర్ఆర్ఆర్` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం రామ్ చరణ్ ఇండియన్ స్టార్ డైరెక్ట్స్లో ఒకరైన శంకర్తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.
`ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్తో ప్రారంభమైన ఈ చిత్రంలో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీకాంత్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, జయరామ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు హై బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.
దిల్ రాజుకు ఇది 50వ ప్రాజెక్ట్ కావడంతో.. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ సగానికి పైగా పూర్తైంది. కానీ, ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఒక్క అప్డేట్ బయటకు వదల్లేదు. అప్పుడెప్పుడో సినిమా స్టార్ట్ అయినప్పుడు ఓ ఫోటోను రిలీజ్ చేశారు. ఆ తర్వాత మరే అప్డేట్ రాలేదు.
పైగా దిల్ రాజు గత కొద్ది రోజుల నుండీ తమిళ హీరో విజయ్తో నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం `వారసుడు` షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ అభిమానులు `ఆర్సీ 15`ను పట్టించుకోవడం లేదంటూ దిల్ రాజుపై మండిపడుతున్నారు. దిల్ రాజు మేలుకో.. ఇప్పటికైనా ఆర్సీ15 అప్డేట్స్ ఇవ్వు అని ఆయన పేరును ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. మరి ఇప్పటికే అభిమానుల ఆగ్రహాన్ని గ్రహించి దిల్ రాజు `ఆర్సీ 15`పై అప్డేట్ ఇస్తారో..లేదో..చూడాలి.