నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి, ఆమెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. కన్నడ హీరోయిన్ అయిన రష్మిక.. `ఛలో` మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టి, ఇక్కడ అనతి కాలంలోనే స్టార్ హోదాను దక్కించుకుంది. ఇక్కడ స్టార్డమ్ రాగానే ఇతర భాషల పైన కూడా దృష్టి సారించిన రష్మిక.. ప్రస్తుతం సౌత్ పాటు నార్త్లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.
తాజాగా ఈ బ్యూటీ `సీతా రామం`తో ప్రేక్షకులను పలకరించింది. టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కీలక పాత్రను పోషించింది. అద్భుతమైన ప్రేమ కథగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. ఆగస్టు 5న విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
పాకిస్థాన్ లో పుట్టిపెరిగిన అఫ్రీన్ గా డిఫరెంట్ పాత్రలో నటించి రష్మిక మెప్పించింది. ఈ మూవీతో మరో హిట్ను ఖాతాలో వేసుకున్న రష్మిక.. తాజాగా తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసి నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందట. `పుష్ప` మూవీ తర్వాత రష్మికకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ దక్కింది. అలాగే ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫస్ వద్ద మంచి విజయం సాధిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ సినిమాలకు రూ.4 కోట్లు, సౌత్ సినిమాలకు రూ.3 కోట్లు రెమ్యుషనరేషన్గా ఇవ్వాలని రష్మిక డిమాండ్ చేస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో ఆమెకే తెలియాలి. కాగా, రష్మిక ప్రస్తుతం తెలుగులో `పుష్ప 2`, తమిళంలో `వారసుడు`, హిందీలో `మిషన్ మజ్ను`, `గుడ్ బై`, `యానిమల్` చిత్రాలు చేస్తోంది. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా రష్మిక చేతిలో ఉన్నాయి.