రెబల్ స్టార్ కృష్ణంరాజు(83) ఇక లేరన్న సంగతి తెలిసిందే. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కృష్ణం రాజు ఆకస్మిక మరణం తెలుగు సినీ పరిశ్రమకు విషాదంలోకి నెట్టేసింది.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన ఆయన.. ఫోటో జర్నలిస్ట్ గా పని చేసేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి విలన్గా కొన్ని సినిమాలు చేశారు. ఆపై హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసి ప్రేక్షకుల్లో గొప్ప నటుడిగా చెరుగరాని ముద్ర వేసుకున్నారు. సహాయక పాత్రలను సైతం ఆయన పోషించారు.
1966లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన కృష్ణం రాజు 190కి పైగా చిత్రాల్లో నటించారు. ఇన్నేళ్ల సినీ కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నారు. కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నారు. అలాగే మరోవైపు కృష్ణంరాజు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ కేంద్ర మంత్రిగానూ సేవలందించారు.
అటువంటి వ్యక్తి గతంలో ఓ ఇంటర్వ్యూలో తన మరణం ఎలా ఉండాలో వివరించారు. `ఒక పచ్చని చెట్టు నీడలో పడుకుని .. ఆకాశం వంక చూస్తూ .. ఎవరికీ ఎప్పుడూ ఎలాంటి అన్యాయం చేయలేదనే గర్వంతో గుండెలపై చేయి వేసుకుని తుది శ్వాస విడవాలి. అదే నా చివరి కోరిక` అంటూ కృష్ణంరాజు చెప్పుకొచ్చాడు. అప్పట్లో ఆయన తమ మరణం పట్ల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. కాగా, సోమవారం మధ్యాహ్నం తర్వాత కృష్ణంరాజు అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఇందుకు అన్ని ఏర్పట్లు చేస్తున్నారు.