Shankarabharanam: తెలుగు సినీ చిత్రాలలో శంకరాభరణం ఓ అద్భుతమైన కళాఖండం.. ఇప్పటికీ ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా కూడా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది.. ఈ సినిమా నేపథ్యం, సంగీతం, పాటలు, నటీనటుల నటన అన్ని రకాలుగా శంకరాభరణం సినిమా ఉన్నత స్థాయిలో ఉంటుంది. తాజాగా శంకరాభరణం సినిమాకి ఇప్పుడు దేశ స్థాయిలో గుర్తింపు వచ్చింది..!
కళాతపస్వి కే విశ్వనాథ్ తీసిన ప్రతి సినిమా ఆణిముత్యమే. తెలుగు సినిమా బ్రతికి ఉన్నంతకాలం విశ్వనాథ్ కీర్తి అజరామరంగానే ఉంటుంది. కె విశ్వనాథ్ తీసిన శంకరాభరణం సినిమా అయితే అద్భుత కళాఖండమే. గోవాలో జరిగే 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఇండియా 2022 ఈవెంట్లో శంకరాభరణం చిత్రాన్ని రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్స్ విభాగంలో ఎంపిక చేశారట. జాతీయ చలనచిత్ర అర్కైన్స్ వారు మనదేశంలోని గొప్ప చిత్రాలను డిజిటలైజ్ చేసి భద్రపరిచే కార్యక్రమంలో భాగంగా.. తెలుగులో విశేష ఆదరణ పొందిన శంకరాభరణం చిత్రాన్ని ఎంచుకున్నారు. వాటిని ఈవెంట్లో ప్రచురించనున్నారు. తెలుగు నుంచి ఈ విభాగంలోకి ఎంపికైన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం.
1980లలో వచ్చిన చిత్రాలలో శంకరాభరణం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మాస్ క్లాస్ ఆడియన్స్ తో సంబంధం లేకుండా అందర్నీ ఈ చిత్రం ధియేటర్ కు వచ్చేలాగా చేసింది. 80వ దశకంలో ఈ సినిమాకు కలెక్షన్లు రావు ఫ్లాప్ అవుతుందని అంత అనుకున్న దర్శక నిర్మాతలు ధైర్యం చేసి ఈ సినిమాను తీశారు. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్ గా నిలబెట్టేసారు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు మరోసారి గోవాలో ప్రదర్శితం కాబోతోంది. ఈ చిత్రానికి నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కుమారు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు.
స్వర్ణకమలం అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. ఈ సినిమాకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బెస్ట్ గాయకుడిగా తొలిసారి జాతి అవార్డు అందుకున్నాడు. శ్రీమతి వాణి జయరాంకు ఉత్తమ గాయకురాలిగా, కేవీ మహదేవన్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు దక్కాయి. విశ్వనాధ్ దర్శకత్వంతో పాటు ఈ సినిమాకు కె.వి మహదేవన్ సంగీతం ప్రాణంగా నిలిస్తే.. జంధ్యాల మాటలు, జెవి సోమయాజులు, మంజు భార్గవి, అల్లు రామలింగయ్య, చంద్రమోహన్ నటన శంకరాభరణం ను అద్భుత కళాకాండంగా మార్చాయి.