శర్వానంద్.. ఈయన గురించి పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉన్న హీరోల్లో శర్వానంద్ ఒకడు. కానీ, ఈయన గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. అయితే ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్న శర్వా.. `ఒకే ఒక జీవితం` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించాడు. శర్వానంద్, రీతూ వర్మ ఇందులో జోడీగా నటించారు. అక్కినేని అమల, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ప్రధాన పాత్ర పాత్రలను పోషించగా.. జెక్స్ బిజోయ్ స్వరాలు సమకూర్చారు.
ఈ నెల 9వ తేదీని `ఒకే ఒక జీవితం` విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా శర్వానంద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా వరుస ఫ్లాపులతో శర్వానంద్ మాట్లాడుతూ..
`ఇటీవల కాలంలో నేను చేసిన సినిమాల్లో నాలుగైదు ఫ్లాప్ అయ్యాయి. అందులో `పడి పడి లేచే మనసు` ఒకటి. ఈ సినిమా తప్పకుండా ఆడుతుందనే బలమైన నమ్మకంతో చేశాను. ఎండల్లో .. వానల్లో చాలా కష్టపడ్డాము. కానీ, చివరకు ఈ మూవీ ఫ్లాప్ అవ్వడంతో పూర్తిగా అప్సెట్ అయ్యాను. మూడు నెలల పాటు ఇంట్లో నుంచి అసలు బయటికి రాలేదు. ఆ తరువాత ఫ్లాపులు వచ్చినా సర్దుకున్నాను. ఫ్లాపుల నుంచి పాఠాలను నేర్చుకున్నాను. ఆరు నెలల పాటు ఆలోచన చేసి ఎంచుకున్న కథనే `ఒకే ఒక జీవితం`. ఇది ఖచ్చితంగా గొప్ప సినిమా అవుతుందనే నమ్మకం ఉంది` అంటూ చెప్పుకొచ్చాడు.