విలక్షణ నటుడు సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించి ప్రేమకథా చిత్రం `గుర్తుందా శీతాకాలం`. నాగశేఖర్ మూవీస్ బ్యానర్పై నాగశేఖర్, భావన, రవి నిర్మిస్తున్న ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించాడు. సుహాసిని, కావ్యశెట్టి మేఘా ఆకాష్, ప్రియదర్శి తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు.
ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. వరుస అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. మొదట ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నా కుదరలేదు. ఆ తర్వాత జూలై 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
ఆ తేదీకి కూడా ఈ సినిమా రాలేదు. ఇక ఇటీవల ఆగస్టు 5న `గుర్తుందా శీతాకాలం` విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. కానీ, అదే రోజు కల్యాణ్ రామ్ `బింబిసార`, దుల్కర్ సల్మాన్ `సీతారామం` చిత్రాలు రిలీజ్ కావడంతో.. సత్యదేవ్-తమన్నాల ప్రేమకథ వెనక్కి తగ్గింది.
అయితే తాజాగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 23న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా బయటకు వదిలింది. మరి ఈ సారైనా `గుర్తుందా శీతాకాలం` థియేటర్స్లోకి దిగుతుందా.. లేదా.. అన్నది చూడాలి.