విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తమిళంలో హీరోయిన్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈ అమ్మడు.. క్రమక్రమంగా విలన్ పాత్రలు మరియు సహాయక పాత్రలకు షిఫ్ట్ అయింది. `తెనాలి రామకృష్ణ` సినిమాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
ఆ తర్వాత `క్రాక్` సినిమాలో జయమ్మగా విశ్వరూపం చూపించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఓవైపు విలన్ గా.. మరోవైపు సహాయక పాత్రలను పోషిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో సైతం నటిస్తోంది.
ఇకపోతే ఈమె కేలక పాత్రలో నటించిన `యశోద` చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది. సమంత టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రానికి హరి హరీష్ కలిసి దర్శకత్వం వహించారు. నవంబర్ 4న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే అరుదైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సమంత ప్రమోషన్స్లో పాల్గొనే పరిస్థితి లేదు. దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ వరస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తనవంతు సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది.
ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి.. తన పెళ్లి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉందని.. పెళ్లి గురించి ఆలోచించే తీరిక తనకు లేదని వరలక్ష్మి తెలిపింది. ఒకవేళ నచ్చినవాడు తారసపడ్డప్పుడు పెళ్లి చేసుకుంటాను.. కానీ, ఇప్పటికైతే తనకు ఆ ఆలోచన లేదని తెలిపింది. అలాగే ప్రస్తుతం తాను సింగిల్ గా ఉన్నానని కూడా వెల్లడించింది. దీంతో వరలక్ష్మి కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.