`అర్జున్ రెడ్డి` మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారి టాలీవుడ్ లో రౌడీ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ.. రీసెంట్ గా `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా, హిరూ యష్ జోహార్ లు నిర్మించారు. పూరీ జగన్నాథ్ కూడా ఈ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరించారు. అలాగే ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తే.. రమ్యకృష్ణ, రియల్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్, రోనిత్ రాయ్, విష్ణు రెడ్డి వంటి స్టార్స్ కీలక పాత్రలను పోషించారు.
హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25న విడుదలైన ఈ చిత్రం.. తొలి షో నుంచి ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. అంచనాలను ఏ మాత్రం అందుకోలేక.. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఘోరంగా బోల్తా పడింది. ఈ సినిమా రూ. 90 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే వీకెండ్ లోనే మినిమమ్ ఇంపాక్ట్ ని చూపించలేక పోయిన లైగర్.. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యే సమయానికి రూ. 26.37 కోట్ల షేర్, రూ. 55.50 కోట్ల గ్రాస్ వసూళ్లతో సరిపెట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం ప్రభావం చూపకపోవడంతో.. మరికొద్ది రోజుల్లోనే ఈ మూవీని థియేటర్స్ నుంచి తొలగించేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇకపోతే `లైగర్` డిజాస్టర్ అవ్వడంతో డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు రూ. 50 కోట్ల వరకు నష్టాలు ఉంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ పూరి, నిర్మాత ఛార్మీ కౌర్ డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా టాక్ నడుస్తోంది. అయితే విజయ్ దేవరకొండ కూడా పూరి జగన్నాథ్, ఛార్మీలకు అండగా నిలవాలని భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే తన రెమ్యునరేషన్ లో కొంత మొత్తం వెనక్కి ఇచ్చేశాడట.
వాస్తవానికి `లైగర్` కోసం విజయ్ దాదాపు మూడేళ్లు కష్టపడ్డాడు. కానీ, ఆయన శ్రమకు ఏ మాత్రం ఫలితం దక్కలేదు. అయినాసరే మంచి మనసుతో తనవంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడట. `లైగర్` సినిమా కోసం విజయ్ దేవరకొండ కి రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని, అలాగే నాన్ థియేట్రికల్ రైట్స్ లో వాటా కూడా ఉందని అంటున్నారు. మొత్తంగా విజయ్ రెమ్యునరేషన్ విలువ రూ.20 కోట్లు ఉంటుందట. అయితే అందులో విజయ్ రూ.6 కోట్ల వరకు వెనక్కి ఇచ్చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.