టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ పూరీ జాగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా, హిరూ యష్ జోహార్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు.
బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తే.. రమ్యకృష్ణ, ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్, మకరంద్ దేశ్పాండే తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఆగస్టు 25న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ అన్ని భాషల్లోనూ ప్రమోషన్స్లో పాల్గొంటూ సినిమాపై భారీ హైప్ను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే విజయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తో సినిమా చేయాలనుంది అంటూ తన మనసులో కోరికను బయట పెట్టాడు.
`లోకేష్ కనకరాజ్ సినిమాలకు నేను వీరాభిమానిని. రీసెంట్ గా ఆయన నుంచి వచ్చిన విక్రమ్ సినిమాను చూశాను. ఆ సినిమాను చూస్తూ నన్ను నేను మరిచిపోయాను. లోకేశ్ కనగరాజ్ విక్రమ్ను చాలా అద్భుతంగా తీశాడు. లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని నాకు చాలా ఉత్సాహంగా ఉంది. భవిష్యత్తులో అతడి నుండి పిలుపు వస్తుందని అనుకుంటున్నాను` అంటూ చెప్పుకొచ్చారు. మరి విజయ్ కోరిక తీరుతుందో..లేదో..చూడాలి.