సోషల్ మీడియాలో అనేక ఫేక్ న్యూస్ సెర్క్యూలేట్ అవుతుండటం తెలిసిందే. అయితే కొందరు ఏకంగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా పైనే తప్పుడు ప్రచారానికి తెరలేపారు. అయితే ఆయన తప్పుడు ప్రచారానికి పాల్పడిన వారిపై గుస్సా కాలేదు. తప్పుడు వార్తలకు స్పందించడంలో ఆలస్యానికి కారణం కూడా ట్విట్టర్ వేదికగా చెప్పారు.
విషయంలోకి వెలితే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా సోకిందనీ, బోన్ కేన్సర్తో బాధపడుతున్నారననీ, ఆస్పత్రిలో చికిత్సి పొందుతున్నాడనీ, పరిస్థితి విషమంగా ఉందనీ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. మరొ కొందరైతే ఆయనే స్వయంగా తనకు కేన్సర్ ఉందని ట్వీట్ చేశారనీ, స్వస్థత చేకూరడానికి రంజాన్ మాసంలో ముస్లింలు తన కోసం ప్రార్థన చేయాలనీ కోరినట్లు పుకార్లు లేపారు. అయితే వాటిపై ఆయన స్పందించలేదు. దీంతో ఏదో అయిందని కూడా ఊహాగానాలు వెలువడ్డాయి. ఇలాగైతే కాదని భావించిన అమిత్ షా ఎట్టకేలకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనకే రోగమూ రోష్టూ లేవని, అసత్య ప్రచారాన్ని నమ్మకూడదని పేర్కొన్నారు.
“నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. అనారోగ్యం వార్తలన్నీ అబద్ధం. ఇలాంటి వదంతులు ఎవరు పుట్టిస్తున్నారో గాని నా చావు కోరుకునే వారి వల్ల నా ఆయుష్షు మరి కొంత పెరగుతుంది. హిందూమతం ఈ విషయం చెబుతోంది. కరోనా వైరస్ నిరోధక పనుల్లో తీరికలేకుండా ఉన్నాను. అందుకే స్పందించలేదు. అయితే లక్షలాది పార్టీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఈ విషయం చెబుతున్నాను” అని అమిత్ షా పేర్కొన్నారు.
కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేస్తున్న నలుగురిని అహ్మదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక నకిలీ ట్విటర్ ఖాతా తెరిచి వారు వదంతులను ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు.