మన పెద్దలు దూరదృష్టితో, సమాజ శ్రేయస్సుతో ఆలోచించి కొన్ని ఆచారములను, సంస్కారములను మనకు తెలియచేసారు.
అట్టి సంస్కారములలో ఒకటి ఈ షష్టి పూర్తి మహోత్సవము. గతాన్ని ఒక్కసారి వెనుదిరిగి చూసుకొని , పగలు – పంతాలు మరచి పోయి, కోపతాపాలు ప్రక్కన బెట్టి. దూరమైన చుట్టాలని, మరచిన స్నేహితులని హృదయ పూర్వకంగాపిలిచి చేసుకొనే వేడుక ఈ షష్టి పూర్తి. అరవై సంవత్సరాల వయ్యస్సు వచ్చిందంటే… ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న దాంపత్యానుభవం, ఎంతో లోకానుభవం ఉంటుంది..!
అన్నదమ్ములు కోడళ్లు,కొడుకులు అల్లుళ్ళు కూతుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు,, బంధువులు మిత్రులు…. ఇలా ఎంతమందో.. వీళ్ళందరినీ కలవాలి… అలా జరగాలంటే ఏదో ఒక వేడుక ఉండాలి. అదే పిల్లలు పెద్దలకు జరిపే షష్టి పూర్తి వేడుక. అసలు మనిషియొక్క పూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలు. దీనిలో సగభాగం 60సంవత్సరాలు. అరవై ఏళ్ళు నిండగానే ఆ వ్యక్తి జీవితంలో ముఖ్యమైన భాగం అంతా పూర్తి అయినట్లు.
దీని తరువాత ఆధ్యాత్మిక జీవితమే అని గుర్తు. దీనికోసమే షష్టి పూర్తి ఉత్సవం చేసి, పిల్లలకు బాధ్యతలు ఒప్పగించి, వాన ప్రస్థులవుతారు. మానవుని సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది. 60 సంవత్సరాలు నిండినప్పుడు చేసుకునేది షష్టిపూర్తి. ప్రతివారికీ మృత్యువు 60 వ యేట ఉగ్రరథుడు అను పేరుతో , 70 వ యేట భీమరథుడు అను పేరుతో, 78 వ యేట విజయరథుడు అనుపేరుతో ఎదురుచూస్తుంటాడు.
ఆరోగ్య సమస్యలకు తట్టుకోవటానికి చేసే శాంతి ప్రక్రియ షష్టిపూర్తి.బృహస్పతి , శని 30 సంవత్సరాలకు మానవుని జన్మకాలంలో ఉన్నరాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది.వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవటంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుంది. తిరిగి జీవితం ప్రారంభం ఐనట్లు సంకేతం.మానవుడు పుట్టిన తెలుగు సంవత్సరాలు (60) నిండుతాయి కనుక షష్టిపూర్తి.షష్టిపూర్తి సందర్భంగా ఆయుష్కామన యజ్ఞము చేస్తారు.
ఆయువును కోరి చేయు యజ్ఞము ఆయుష్కామనయజ్ఞము అని అపమృత్యు నివారణార్థం హోమాల్ని, జపాలని కుడా చేస్తారు. తదుపరి బ్రహ్మలను సత్కరించి బంధుమిత్రులతో విందు ఆరగిస్తారు. శాస్త్ర ప్రకారం షష్టిపూర్తి రోజు అభ్యంగన స్నానాదులు, మహా మృత్యుంజయ హోమం, ఇతర నవగ్రహ, చండి, సుదర్శన, లక్షినారసింహ మొదలగు హోమ క్రతువులు పెద్దల ఆశీర్వాదాలు తీసుకుని దానధర్మాలు చేస్తే చాలా మంచిది. ఆర్ధిక స్తోమత లేనివారు అభ్యంగన స్నానం చేసి ఇంట్లో కుల దైవానికి, తలిదండ్రులు జీవించి ఉంటే వారికి, గోమాతకు పూజ చేసి ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయ దర్శనం చేసి అక్కడ ఉన్న పేదలకు, యాచకులకు తోచిన సహాయం చేయాలి.
పూర్వకాలంలో పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరగినట్టే భావించేవారు కనుక స్త్రీలకు మళ్ళీ విడిగా షష్టిపూర్తి చేసే ఆచారంలేదు. పెళ్లి సాధారణంగా జరగాలి. షష్టిపూర్తి ఘనంగా జరగాలని పెద్దల మాట. ఎందుకంటే షష్టిపూర్తి దృఢమైన ఆత్మీయతల సుగంధం పరిమళించే సందర్భం కనుక. బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రులకు అర్పించుకొనే అపురూప సందర్భం షష్టిపూర్తి.