Bail to Pattabhi: సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో టీడీపీ నేత పట్టాభిరామ్ కి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాష్ట్రంలో మూడు రోజులుగా రాజకీయ వివాదంగా మారిన ఈ వివాదంలో పట్టాభి వ్యాఖ్యలే కారణమని వైసీపీ బలంగా వాదిస్తుంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో కూడా పట్టాభికి బెయిల్ రాకుండా చేసేందుకు ప్రభుత్వ న్యాయవాదులు సమర్ధనీయం వాదనలు వినిపించారు. పట్టాభి చేసిన వ్యాఖ్యల వీడియోలు సీడీలను కోర్టుకి అందించారు. మరోవైపు పట్టాభి తరపున న్యాయవాదులు కూడా గట్టిగా వాదనలు వినిపించారు. పట్టాభిపై పెట్టిన సెక్షన్లు.. అతను చేసిన నేరానికి, అతను చేసిన వ్యాఖ్యలకు వర్తించవని వాదించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు పోలీసుల తీరుపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీఆర్పీసీ 41 ప్రకారం నోటీసులు ముందస్తుగానే ఎందుకు అందించలేదని ప్రశ్నించింది. రూల్ ఆఫ్ లా అందరికీ సమానమేనని.., పోలీసుల వైఖరి సరిగ్గా లేదని కోర్టు పేర్కొంది. పోలీసులు సరైన న్యాయపరమైన విధానాలు పాటించలేదు కాబట్టి బెయిల్ ఇస్తున్నట్టు పేర్కొన్నారు..
చివరిగా ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు పట్టాభికి బెయిల్ ఇచ్చింది. సెక్షన్ 41 ఏ నోటిసులపై పోలీసులు కింది కోర్టు సూచనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం జగన్పై పరుష పదజాలం ఉపయోగించినందుకు పట్టాభిపై క్రైం నం.352/2021తో ఐపీసీ 153(ఎం), 505(2), 353, 504 రెడ్విత్ 120(బి) సెక్షన్ల కింద గవర్నరుపేట పోలీస్స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పట్టాభి రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు బెయిల్ ఆదేశాలు అందిన తర్వాత విడుదల చేయనున్నారు.