వహ్వా..! కాషాయం రెపరెపలాడుతోంది. ఆరెంజ్ పతాకం ఓ రేంజ్ లో వెలిగిపోతుంది. ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే తేడా లేకుండా దేశం మొత్తం మీద జరిగిన ఎన్నికల్లో.. ఈ రోజు జరుగుతున్నా కౌంటింగ్ లో బీజేపీ సత్తా చాటుతుంది. ఇది దేనికి సూచిక..? అనేది పక్కన పెడితే ఈ విజయానికి కారణాలు మాత్రం స్పష్టమే. అటు అయోధ్య సెంటిమెంట్.., ఇటు మోడీపై నమ్మకం.., మరోవైపు బీజేపీ స్టైల్ రాజకీయం, పోల్ మేనేజ్మెంట్ బాగా కలిసివచ్చినట్టే కనిపిస్తుంది.
బీహార్ లో తేజస్వి ఆశలు ఆవిరి..!!
పాపం బీహార్ ఎన్నికలు దేశానికి కొత్త మార్గం వేస్తాయని అందరూ భావించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఫలితాలు రాబోతున్నాయని ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రకటించాయి. దేశం మొత్తం బీజేపీ బీహార్ లో ఓడిపోతుంది అంటూ కోడై కూసింది. కానీ ఈవీఎం వేరేగా చెప్తుంది. ఈ రోజు వస్తున్న ఫలితాల్లో బీహార్ లో బీజేపీ బలం బాగా పెరిగినట్టు స్పష్టమవుతుంది. 2015 లో వచ్చిన స్థానాల కంటే ఈసారి బీజేపీకి 20 స్థానాలకు పైగా అధికంగా రానున్నట్టు ఆధిక్యత లెక్కలు చెప్తున్నాయి.
బీహార్ ఎన్నికల్లో ఈ సారి ఎలాగైనా గెలిచి రాష్ట్రాన్ని పాలించి గుప్పిట్లో పెట్టుకోవాలి.., లాలూ వారసుడిగా ముద్ర వేసుకోవాలి అనుకున్న తేజస్వి ఆశలు గల్లంతయ్యాయి. మరోవైపు నితీష్ కుమార్ కి కూడా షాక్ ఇస్తూ జెడీయు కంటే అధికంగా బీజేపీకి స్థానాలు రానున్నట్టు తెలుస్తుంది. అదే జరిగితే అక్కడ సీఎం కుర్చీకి కూడా కాషాయ కర్చీఫ్ వేసెయ్యడం ఖాయమే.
మధ్య ప్రదేశ్ లో బీజేపీ హవా..!!
మరోవైపు మధ్య ప్రదేశ్ లో కూడా బీజేపీ వెలిగిపోతుంది. మొత్తం 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండగా.., 18 స్థానాల్లో బీజేపీ ఆధిక్యతలో ఉంది. కేవలం 8 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ ముందంజలో ఉంది. ప్రస్తుతం అక్కడ బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటుకి 8 స్థానాలు కావాల్సి ఉండగా.. ఈ ఫలితాలు చూస్తే అదేమి కష్టం కాదు. సో.. ఇక మధ్య ప్రదేశ్ కాషాయపరమైనట్టే.
* గుజరాత్ లో ఉప ఎన్నికలు జరిగిన 8 స్థానాల్లోనూ అధికార బీజేపీ హవా కనిపిస్తుంది. అక్కడ కాంగ్రెస్ ఖాతా తెరిచే అవకాశాలే లేవు. * కర్ణాటకలో జరుగుతున్నా రెండు స్థానాల్లోనూ బీజేపీ సత్తా చాటుతుంది. * మణిపూర్ లో బీజేపీ రెండు, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. * ఒడిశాలో మంత్రం నవీన్ పట్నాయక్ ని ఢీకొట్టడం బీజేపీకి కాలేదు. అక్కడ మాత్రం రెండు స్థానాల్లోనూ బీజేడీ ఆధిక్యంలో ఉంది.
తెలంగాణలో కేసీఆర్ కి చెమటలు..!!
ఇక మన తెలంగాణ దుబ్బాకలో ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆరెస్ కి చుక్కలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ కి చెమటలు పడుతున్నాయి. అక్కడ సానుభూతి, సెంటిమెంట్, అధికార హవాతో గెలిచేద్దాం అనుకున్న టీఆరెస్ కి ఓటర్లు భిన్నమైన తీర్పు ఇచ్చినట్టే కనిపిస్తుంది. ప్రస్తుతానికి 8 రౌండ్లు కౌంటింగ్ పూర్తవ్వగా… బీజేపీ 3106 ఓట్ల ఆధిక్యంలో ఉంది. అక్కడ బీజేపీ గెలిచి, టీఆరెస్ ఓడితే మాత్రం తెలంగాణలో సరికొత్త రాజకీయం చుడనున్నాం. ఇన్నాళ్లు తమకు తిరుగులేదు అనుకున్న టీఆరెస్ కి సిటింగ్ స్థానం కోల్పోవడం… పైగా రెండేళ్ల కిందట 60 వేల ఆధిక్యతతో గెలిచినా సీటుని ఇప్పుడు కోల్పోవడం మాత్రం పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టే. అయితే ఇక్కడ మరో 15 రౌండ్లు లెక్కించాల్సి ఉంది. 65 శాతం ఓట్లు లెక్కించాల్సి ఉంది. మరో గంటన్నరకు తుది ఫలితంపై స్పష్టత వచ్చే వీలుంది.