బీజేపీ అన్ని వ్యవస్థలను శాసిస్తుంది. బీజేపీ దేశాన్ని గుప్పిట్లో పెట్టుకుని ఏలుతుంది. బీజేపీ ప్రతిపక్ష రాష్ట్రాలను ఇబ్బంది పెడుతుంది..! ఇవన్నీ మనం ఇన్నాళ్లుగా వింటున్నాం, చూస్తున్నాం..! అన్నిటికంటే డేంజర్ కోవలోకి వచ్చే బీజేపీ మార్కు గేమ్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ గేమ్ తెలుసుకునే ముందు ఏడేళ్ల కిందట బ్రెజిల్ ప్రధానిని అమెరికా శాసించాలనుకున్న ఓ వ్యవహారాన్ని చూద్దాం..!!
ఆరేళ్ళ కిందట అమెరికాలో ఒక పెద్ద సంచలన అంశం బయటపడింది. యుఎస్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ) ఆ దేశంలోని పదిలక్షల మంది టెలిఫోన్ రికార్డులను.., ప్రముఖుల రహస్యాలను కూడా నిఘా ద్వారా సేకరించింది. అన్నిటి కంటే ముఖ్యంగా అప్పటి బ్రెజిల్ ప్రధాని తన వ్యక్తిగత కార్యదర్శితో ఏకాంతంగా గడిపిన వీడియోలు ఎన్ఎస్ఏ సేకరించి., వీటి ద్వారా బ్రెజిల్ ని శాసించాలి అనుకుంది. సాక్షాత్తూ ప్రధానమంత్రి ఇలా దొరికితే పరిపాలన సవ్యంగా సాగదు. నిజానికి దీన్ని బయటపెడితే ప్రధాని పదవి కోల్పోతారు, లేదా వ్యక్తిగత అంశం అని వదిలేయాలి. కానీ దీన్ని పట్టుకుని బ్లాక్ మెయిల్ చేయాలి అనుకుంటే… బ్రెజిల్ పాలన సవ్యంగా సాగదు, గతి తప్పుతుంది. ఆ దేశ సమస్యలపై ప్రధాని దృష్టి పెట్టలేరు. ఇది పూర్తిగా అమానవీయం. ఇక్కడ తప్పుచేస్తే తేల్చేయాలి, లేదా వదిలేయాలి. పాలనలో స్వేచ్ఛ ఇవ్వాలి. కానీ ఈ కేసుని, వీడియోని పట్టుకుని బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకుంటే ఆ దేశమే నాశనం అవుతుంది. అందుకే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఎడ్వర్డ్ స్నోడెన్ (సెక్యూరిటీ నిఘాలో కీలక అనలిస్ట్) ఈ నిఘా వ్యవహారాన్ని మొత్తం మీడియాకి వెల్లడించారు. దీంతో ఎడ్వర్డ్ పై దేశ ద్రోహం కేసు, రహస్య పత్రాల దొంగతనం కేసు మోపారు. ఆయన అక్కడి నుండి చాలా దేశాలు తిరిగి.., చివరికి రష్యాలో తలదాచుకున్నారు. ఈ అంశం ద్వారా అమెరికాలో శాసించే గుణం.. వ్యవహారం ఎందుకు చెప్పుకున్నామంటే..!! మన దేశంలో అనేక మంది ముఖ్య పాలకులపై కేసులున్నాయి. ఏళ్ల తరబడి నానుతున్నాయి. ఇవి బీజేపీకి ఆయుధాలుగా మారుతున్నాయి. అందుకే చాలా రాష్ట్రాల అంతర్గత పాలన వ్యవహారాల్లో బీజేపీ వేలు, కాలు, తల పెడుతుంది.
పాలకులపై ఉన్న కేసులతో శాసించే తత్వం..!!
బీజేపీ మన దేశంలో ఏం చేస్తుంది..? రాష్ట్రాలను గుప్పిట్లో ఎలా పెట్టుకుంటుంది..? అనేది ఆలోచిస్తే పైన చెప్పుకున్నఅంశాన్ని గుర్తు చేసుకోవాల్సిందే. బీజేపీ పాలనలో అరాచకాలు ఉంటున్నాయి. తమకు బలం లేకపోయినా గవర్నర్లు, కోర్టుల ద్వారా కొన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. ఇంకొన్ని రాష్ట్రాల్లో తమకు పట్టు లేకపోయినా పాలనలో వేలు పెడుతుంది. శాసిస్తుంది. దీన్ని ఎవరూ గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారు. కారణం కేసులు. ఆ నేతలపై, రాష్ట్రాల పాలకులపై ఉన్న కేసులే బీజేపీకి అస్త్రాలుగా మారుతున్నాయి. “వ్యవస్థలు బీజేపీ చేతిలో ఉండడంతో ఈ పాలకులు కూడా తలొంచక తప్పడం లేదు”..! ఆ కేసులు చట్ట ప్రకారం.., న్యాయవ్యవస్థలు స్వేచ్ఛగా డీల్ చేసుకుంటే బీజేపీకి వీళ్ళు లొంగాల్సిన అవసరం ఉండదుగా..! సింపుల్ గా “బీజేపీ చేతిలో కత్తి ఉంది. నేతలపై కేసుల మెడలున్నాయి. ఆ కత్తిని ఈ మెడలపై పెట్టి, పని చేయించుకుంటుంది. బీజేపీ ఇలా చేస్తున్న కారణంగా ఆయా రాష్ట్రాల్లో పాలకులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండడం లేదు. ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. దీని వలన అంతిమంగా ప్రజలే నష్టపోతున్నారు. రాష్ట్ర పరిస్థితులు గందరగోళంగా మారుతున్నాయి.
* మమతా బెనర్జీపై రెండు కుంభకోణాలున్నాయి. శారదా చిట్స్ సహా రోజ్ వాలీ చిట్స్ కుంభకోణం కేసులు. వీటి విలువ సుమారుగా రూ. 45 వేల కోట్లు. ఇవి మమతకు ఎప్పటికైనా చిక్కులు తెచ్చేవే. మమతని ఇరుకున పెట్టడానికి బీజేపీకి ఈ అస్త్రాలు చాలు.
* శరద్ పవార్ పై మనీ లాండరింగ్ కేసులున్నాయి. పవార్ కుటుంబ సభ్యులపైనా ఈడీ కేసులు నమోదు చేసి అప్పుడప్పుడూ విచారణకు పిలుస్తుంది. ఆస్తులపై నిఘా పెట్టింది.
* ఏపీ సీఎం జగన్ పై కొన్ని కేసులున్నాయి. సీబీఐ కేసులు, ఈడీ కేసుల్లో జగన్ ఏ వన్ ముద్దాయిగా ఉన్నాయి. 11 కేసుల్లో రూ. 43 వేల కోట్లు అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
* లాలూ ప్రసాద్ యాదవ్ పై దాణా కేసు గురించి తెలిసిందే. ఇక కేసీఆర్, నవీన్ పట్నాయక్ పై ప్రస్తుతానికి ఏమి లేకపోయినప్పటికీ వెతికే పనిలో కొందరు పెద్దలు ఉన్నారు. దొరికితే కేసీఆర్ మాట మూగబోయివడం ఖాయమే.
ఎంతగా శాసిస్తుందో తెలుసా..!?
బీజేపీ కొన్ని రాష్ట్రాలను ఎంతగా శాసిస్తుందో కొన్ని ఉదాహరణలు చూస్తే చాలు. ఏపీలో మూడు రాజధానులు, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో బీజేపీ పాత్ర అందరికీ తెలిసిందే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తొలగించే ఆర్డినెన్సులపై గవర్నర్ సంతకం చేయడం.. ఆపై కేసు కోర్టుకి వెళ్లడం.., మధ్యలో బీజేపీలో ఓ వర్గం నేతలు అతన్ని పార్క్ హయత్ హోటల్లో కలవడం.., చివరిగా నిమ్మగడ్డను అనుకూలంగా తీర్పు రావడం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కూడా మూడు రాజధానులు వ్యవహారంలో బీజేపీ వేలు మాత్రమే కాదు, తల కూడా పెట్టింది. ఇక ఈ విషయం మొత్తం ఎందుకు అంటే.. జస్టిస్ ఎన్వీ రమణపై సీఎం జగన్ ఫిర్యాదు చేశారు. ఇక్కడితో జగన్ పాత్ర ఆగింది. తర్వాత రాజ్యాంగ బాధ్ధమైన అడుగులు పడలేదు. దీన్ని ఆసరాగా చేసుకుని జస్టిస్ రమణకి పదోన్నతి ఇవ్వాలా..? వద్దా..? అనేది ఒక గేమ్ ఆడుతుంది. బీజేపీ లాభనష్టాలు చూసుకుని, భావి అవసరాలు చూసుకుని ఈ చర్యలు ఉంటాయి. సో… బీజేపీ ఆడిస్తుంది. ఈ కేసులున్న నేతలు ఆడుతుంటారు. రాష్ట్రాలు గందరగోళంలోకి వెళ్తున్నాయి. ప్రజలు నష్టపోతున్నారు..!