వెనుకడుగు వేసేదీ లేదు..అక్కడే తేల్చేద్దాం
సీమ ఎత్తిపోతల పధకంలో ముందుకే..టెండర్లు సిద్దం
నిన్న..మొన్నటి వరకూ కలిసి మెలిసి ఉంటూ రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకుందామని నిర్ణయించిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వాటర్ వార్ మొదలైంది. అయితే, అది తమ మధ్య సఖ్యతను దూరం చేయలేదని చెబుతూ వచ్చారు. ఏపీతో తమ స్నేహం కొనసాగుతుందని..అదే సమయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకుంటామంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన కొద్ది గంటల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే అంశం పైన సీరియస్ గా స్పందించారు. పిలిచి అన్నం పెట్టి..స్నేహం హస్తం అందిస్తే అవసర కొర్రీలు పెడతారా అంటూ ఫైర్ అయ్యారు. దీని పైన అపెక్స్ కమిటీలోనే తేల్చుకుంటామని ప్రకటించారు. దీని పైన ఇప్పుడు ఏపీ సీఎం సైతం స్పందించినట్లుగా సమాచారం. అయితే, ఆయన కేసీఆర్ పైన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని తెలుస్తోంది. కానీ, కేసీఆర్ తన రాష్ట్రం గురించి ఏ రకంగా వ్యవహరిస్తున్నారో..జగన్ సైతం తన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ ఉండదని తేల్చి చెప్పారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఇచ్చారు. ఎన్ని అభ్యంతరాలు వస్తున్నా..రాయలసీమ ఎత్తిపోతల విషయంలో టెండర్ల ప్రక్రియ ముగిసింది. ఇక…వర్క్ ఆర్డర్ మాత్రమే ఇవ్వాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఏం చేయబోతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
సీమ ప్రాజెక్టుపై ముందకే..కేసీఆర్ పైన ఇలా..
రాయలసీమ ఎత్తిపోతల పధకం పైన రెండు రాష్ట్రాల మధ్య వాటర్ వార్..డైలాగ్ లతో హీటెక్కించి…లీగల్ ఫైట్ గా మారింది. తెలంగాణ ఇప్పటికే సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపైన ముందుకు వెళ్లకుండా చూడాలంటూ పిటీషన్ దాఖలు చేసింది. తెలంగాణ వ్యూహాలను ముందుగానే అంచనా వేసిన జగన్ ప్రభుత్వం అంతుకు ముందే అటు తెలంగాణ హైకోర్టుతో సుప్రీం కోర్టులోనూ కేవియట్ దాఖలు చేసింది. ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు పైన చేసిన వ్యాఖ్యల పైన ముఖ్యమంత్రి వద్ద జరిగిన ఇరిగేషన్ సమీక్షలో చర్చకు వచ్చినట్లుగా సమాచారం. కేసీఆర్ వ్యాఖ్యల పైన ఏ రకమైన కామెంట్లు చేయలేదని..అయితే ఈ ప్రాజెక్టు విషయంలో వెనకడుగు వేసేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే, ఇప్పటి వరకు తెలంగాణతో తమ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ విధంగా అయితే స్నేహం కొనసాగుతుందో అదే విధంగా సఖ్యత ఉండాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పినట్లుగా తెలుస్తోంది. కానీ, ఏపీ ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీ ఉండదని స్పష్టం చేసినట్లు సమాచారం. తనకు ఏపీ ప్రయోజనాల కంటే ఏదీ ముఖ్యం కాదని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
అపెక్స్ కమిటీలోనే తేలుద్దాం..టెండర్లు ఫైనల్ స్టేజీలో..
ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు పైన రాజకీయంగా అటు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఒత్తిడి పెరుగుతోంది. దీంతో…ఆయన సైతం ఏపీ ప్రభుత్వ తీరు పైన విమర్శలు మొదలు పెట్టారు. ఏపీ సీఎం ఇప్పటికే తాము ఎక్కడా గతంలో జరిగిన కేటాయింపులను ఉల్లంఘించి ఈ పధకం తీసుకురావటం లేదని స్పష్టం చేసారు. ఏపీకి జరిగిన కేటాయింపులకు లోబడే తాము ఈ ప్రాజెక్టును ఆమోదించామని.. ఏడాదిలో పది రోజుల సమయంలో వచ్చే వరద నీటిని ఒడిసి పట్టుకొని రాయలసీమ ప్రాంతానికి నీరు అందించటం కోసమే దీనికి రూపకల్పన చేసామని సీఎం వివరిస్తున్నారు. అయినా..తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సమయంలో అటు స్నేహ హస్తం అందిస్తూనే..ఇటు లీగల్ ఫైట్ కొనసాగిస్తూనే…కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో జరిగే అపెక్స్ కమిటీ సమావేశంలోనే వాస్తవాలను వివరంచాలని సీఎం డిసైడ్ అయ్యారు. ఇందు కోసం ప్రాజెక్టుల నిర్మాణం..కేటాయింపుల పైన 2014 నాటికే ఉన్న ఉత్తర్వులతో సహా అన్ని వివరాలను సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు. ఇక, ఇదే సమయంలో ఈ ప్రాజెక్టు కు సంబంధించిన టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రూ.3,278.18 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు పనులకు ప్రధానంగా మూడు సంస్థలు పోటీ పడుతున్నాయి. నవయుగ ఇన్ఫ్రా, మ్యాక్స్ ఇన్ఫ్రా తో పాటుగా మేఘా – ఎన్సీసీసీ-ఎస్పీఎంఎల్ సాంకేతిక అర్హత సాధించాయి. ఈ నెల 17న టెండర్లు దక్కించుకున్న సంస్థలను ప్రభుత్వం ఖరారు చేయనుంది.