యుద్ధం మొదలు పెట్టకుండా ఉండాలి..! మొదలు పెడితే మధ్యలో ఆపకూడదు..!!.ఇంకా సింపుల్ గా చెప్పుకోవాలంటే.. నావ నది మధ్యలోకి వెళ్లిన తర్వాత వెనక్కు వస్తామంటే అంటే కుదరదు..!. ఆ ఒడ్డుకు చేరాల్సిందే.. చేరే ప్రయత్నం చేయాల్సిందే..!! ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ పరిస్థితి అలానే ఉంది. జస్టిస్ రమణతో ఆయన పోరు రెండో దశకు చేరుతుంది. మొదటి దశలోనే దేశవ్యాప్తంగా వ్యవస్థను ఆలోచనలో పడేసి, జాతీయ మీడియాను తన పైపు తిప్పుకొని, రాజకీయ వర్గాలను విస్మయ పరచిన జగన్… ఇప్పుడు రెండో దశలో మరింత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళబోతున్నారు. ఏపీ హైకోర్టులో తన ప్రభుత్వాన్ని వ్యతిరేక తీర్పులు రావడంలో జస్టిస్ రమణ పాత్ర ఉందని.., ఆయన హైకోర్టు జడ్జిలను ప్రభావితం చేస్తున్నారని ఉదాహరణలతో పేర్కొంటూ…, టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో రమణ ఇంత అవినీతి చేశారు.., ఇదిగో ఆధారాలు అంటూ నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? అనేది ప్రస్తుతానికి ఇంకా స్పష్టత రాలేదు. కానీ జగన్ అక్కడితో వదిలేయకుండా తన పోరు రెండో దశకు చేర్చేందుకు వ్యూహాలు సిద్ధం చేశారు. ఇవి కూడా జాతీయస్థాయిలో ఆసక్తి కలిగించేవే.
రెండో దశలో రెండు ప్రణాళికలు..! వాహ్ జగన్…!
జస్టిస్ రమణతో పోరులో రెండో దశలో సీఎం జగన్ రెండు మార్గాలు సిద్ధం చేశారు. లాజికల్ గా ఆలోచిస్తే.. న్యాయవ్యవస్థపై జగన్ పైచేయి సాధించాలంటే.., తాను నెగ్గాలి అంటే జస్టిస్ రమణ ఇప్పుడున్న స్థాయి నుండి కిందకు దిగాలి. లేదా అదే స్థానంలో ఉండి రిటైర్డ్ అయిపోవాలి. అది జగన్ లక్ష్యం. అంటే రమణ ఎట్టిపరిస్థితుల్లోనూ చీఫ్ జస్టిస్ అవ్వకూడదు. అందుకు రెండు మార్గాలు ఉన్నాయి.
* మొదటిది రాజ్యసభలో అభిశంసన తీర్మానం పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఈ తీర్మానం నెగ్గితే రమణను ఉన్న హోదా నుండి తొలగించేందుకు మార్గం మెరుగయ్యే అవకాశాలున్నాయి. అయితే దీనికి కొన్ని చిక్కులు ఉన్నాయి. రాజ్యసభలో కనీసం 50 మంది సంతకం పెడితేనే అభిశంసన తీర్మానం చర్చకు వస్తుంది. అలానే పార్లమెంటులోనూ అభిశంసన తీర్మానం పెట్టాలంటే 100 మంది ఎంపీల మద్దతు కావాలి. అంటే ఈ రెండిటికీ జాతీయ పార్టీలో ఏదో ఒకటి మద్దతు ఇవ్వాలి. లేదా రెండు, మూడు ప్రాంతీయ పార్టీలు కలిసి రావాలి. ప్రస్తుతం జస్టిస్ రమణకు ఉన్న బలం దృష్ట్యా జాతీయ పార్టీలు గానీ, ప్రాంతీయ పార్టీలు గానీ ఇటువంటి అంశాల్లో ముందుకు రాకపోవచ్చు. “జగన్ చేస్తున్న రిస్క్ కు మేము ఎందుకు మద్దతు పలకాలి? మేము ఎందుకు రిస్క్ లో పడాలి?” అని కొన్ని పార్టీలు ఆలోచించే అవకాశం ఉంది.
రెండో మార్గం.. రాష్ట్రపతికి ఫిర్యాదు ద్వారా అడ్డుకట్ట..!!
రాజ్యసభలో అభిశంసన తీర్మానం సాధ్యం కాకపోతే లేదా ఆ ఆలోచన చేయకపోతే.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. జస్టిస్ రమణకు చీఫ్ జస్టిస్ గా పదోన్నతి రావాలి అంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. అందుకే ప్రస్తుతం ఆయనపై ఉన్న ఆరోపణలు, తాను సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖలో పొందుపరిచిన అంశాలతో పాటు రమణకు సంబంధించిన మరిన్ని పాత కేసులు, ఇంకొన్ని లావాదేవీలను కూడా తవ్వి వాటన్నింటితో కలిసి రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే జస్టిస్ రమణ ప్రమోషన్ ను అడ్డుకోవడానికి జగన్ కి మార్గం సుగమం అవుతుంది. అంటే ఈ రెండు మార్గాల్లో సీఎం దీనినే ఎంచుకునే అవకాశం ఉందనేది కీలకం.
ఢిల్లీ వెళ్తే జరిగేది ఇదే..!!
అభిశంసన పెట్టాలి అంటే ఎంపీల మద్దతు ఉండాలి. అంత బలం లేదు కాబట్టి ఇతర పార్టీల ఎంపీలు అంత రిస్కు చేయరు కాబట్టి.., జగన్ రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఒకవేళ ఉన్నపళంగా లేదా ఈ వారంలో జగన్ ఢిల్లీ వెళ్లాల్సి వస్తే.. ఢిల్లీ టూర్ ఖరారు అయితే ఆయన రాష్ట్రపతిని కలిసేందుకు వెళ్తున్నారనేది స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక మీడియాలో, సోషల్ మీడియాలో జగన్ ఢిల్లీ వెళ్లనున్నారని, రాష్ట్రపతిని ప్రధాని మోడీని కూడా కలవనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన కేవలం రాష్ట్రపతి రామ్నాథ్ కోవిద్ ని కలిసే అవకాశం ఉంది. ప్రధానమంత్రి మోదీని ఇది వరకే కలిశారు కాబట్టి మళ్లీ ఈ అంశంలో కలిసే అవకాశం లేదు. అయితే ఎలాగో వెళుతున్నారు కాబట్టి పనిలోపనిగా ఇతర కేంద్ర మంత్రులను ఎవరినైనా కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చర్చించి వచ్చేసే అవకాశమే ఉంది తప్ప ప్రధానమంత్రి మోదీతో ప్రస్తుతం జగన్ కు పని లేనట్లే. ఈ అంశాలకు సంబంధించి ఉన్నది ఉన్నట్టు తటస్థ విశ్లేషణ, కథనాలను “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకంగా అందిస్తుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?