సీఎం జగన్ X జస్టిస్ రమణ ఇష్యూ మొదలై నెలరోజులయింది. ఇప్పటికీ చర్చలు, వార్తలు నడుస్తూనే ఉన్నాయి. న్యాయవ్యవస్థలోని వివిధ దశలకు చెందినవారు జగన్ కి వ్యతిరేకంగా లేఖలు రాస్తూనే ఉన్నారు. సరే… అది వారికి వృత్తి పట్ల ఉన్న గౌరవం, ఏపీలో పరిస్థితులపై అవగాహన లేమి అనుకుందాం..!! ఇక సీఎం జగన్ కి వ్యతిరేకంగా సుప్రీం లో పిటిషన్లు దాఖలయిన సంగతి తెలిసిందే. వాటిని విచారణకు స్వీకరించిన కోర్టు ఈ నెల 16 నుండి విచారణ చేపడతామని పేర్కొంది..! ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇంతకూ జగన్ రాసిన లేఖ ఏమైనట్టు..? లేఖపై తదుపరి అడుగులు పడ్డాయా లేదా..? అంతర్గత కదలికలు మొదలయ్యాయా, లేదా..? అదే ఇప్పుడు కీలక అంశం.
బీజేపీ చేతికే బ్రహ్మాస్త్రం..!!
తేనె తుట్టెని కొట్టి తేనె పెట్టుకోకుండా వదిలేస్తే ఆ కష్టం, ఆ రిస్కు వృథా కదా..? తెలిసి తెలిసి జగన్ ఇటువంటి వృథా పనుల కోసం రిస్కులు చేయరు. అందుకే “న్యూస్ ఆర్బిట్” గతంలోనే చెప్పినట్టు ఇది బీజేపీ ఆడుతున్న ఒక స్కెచ్ కావచ్చు. సుప్రీం తదుపరి ప్రధాన న్యాయమూర్తి విషయంలో బీజేపీ ముందస్తుగా ఇలా జగన్ చేత రాయించవచ్చు. లేదా… జగనే తనకు, తన ప్రభుత్వానికి వస్తున్న వ్యతిరేక తీర్పులను తట్టుకోలేక ఇలా రిస్కు చేస్తే చేయవచ్చు. కానీ ఏదైనా బీజేపీ చేతికి బ్రహ్మాస్త్రం చేరినట్టే. దేశంలో వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్న బీజేపీకి ఈ తతంగం కూడా నడిపించడం పెద్ద కష్టమేమి కాదు. ఈ లేఖ అడ్డు పెట్టుకుని జస్టిస్ రమణని ప్రధాన న్యాయమూర్తి కాకుండా అడ్డుకోవచ్చు.., లేదా “మీపై ఇలా వచ్చినా మేము పట్టించుకోలేదు.., మనం మనం భాయీ భాయీ” అంటూ ఫ్రెండ్షిప్పూ చేయవచ్చు. ఏదయినా ఇక జరిగేది బీజేపీ వ్యహమే..!!
లేఖపై ఏం చేయొచ్చంటే..!? ఇవీ మార్గాలు..!
సీఎం జగన్ రాసిన లేఖపై తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక స్పష్టత లేదు. ఆ లేఖ రాసిన సీఎంపై మాత్రం అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఆయన సీఎం పదవికి అనర్హుడని.., ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని పిటిషన్లు వేశారు. మరో వారం నుండి వాటిని విచారించనున్నారు. ఇక సీఎం రాసిన లేఖపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి మూడు విధాలుగా స్పందించే వీలుంది. కోర్టుల్లో న్యాయమూర్తులపై, ప్రధాన న్యాయమూర్తిపై ఇటువంటి ఆరోపణలు, పిర్యాదులు వస్తే ఏం చేయాలి..? అనే విషయమై (ఇన్ హౌస్ కమిటీ విచారణ) రెండు దశాబ్దాల కిందటే విధివిధానాలు రూపొందించింది. దీని ప్రకారం…
* సుప్రీం న్యాయమూర్తి ఎవరిపై అయినా పిర్యాదులు, ఆరోపణలు వస్తే ముందుగా ప్రధాన న్యాయమూర్తి వాటిని పరిశీలిస్తారు. అవి నాన్ జ్యుడీషియరీ (వృత్తి సంబంధం కాకపోతే) పట్టించుకోరు. మరీ సీరియస్ అయితే సుప్రీం ప్రధాన న్యాయమూర్తి వీటిపై సదరు న్యాయమూర్తి నుండి వివరణ తీసుకుని.. అప్రమత్తం చేస్తారు.
* ఒకవేళ జ్యుడీషియరీ (వృత్తి సంబంధిత) ఆరోపణలు వస్తే మూడు విధాలుగా రియాక్షన్ ఉంటుంది. మొదటి దశలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఆ పిర్యాదులు సహేతుకం కావు, పెద్దగా సీరియస్ కాదు అనుకుంటే వదిలేయవచ్చు. అంశాలు సీరియస్ అయితే, వాటిపై ప్రాధమికంగా వివరాలు సేకరించి.. సదరు న్యాయమూర్తి నుండి వివరణ తీసుకుంటారు. ఈ వివరణతో ప్రధాన న్యాయమూర్తి నమ్మితే, పిర్యాదుని అక్కడితో ముగించవచ్చు. ఒకవేళ ఈ వివరణ కరెక్ట్ కాదు, ఇంకా ఏదో ఉంది అనుకుంటే హౌస్ కమిటీ విచారణ వేస్తారు. ఇతర న్యాయమూర్తులు, ఒక విశ్రాంత ప్రధాన న్యాయమూర్తితో కమిటీ వేసి, విచారణకు ఆదేశిస్తారు. ఈ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయి.
* సదరు న్యాయమూర్తి తప్పు చేసినట్టు తేలితే అతన్ని రాజీనామా కోరతారు.., లేదా స్వచ్చంధంగా పదవీ విరమణ కోరతారు. అందుకు అంగీకరించకుంటే పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టి… అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో సదరు న్యాయమూర్తిని తొలగిస్తారు.
జగన్ లేఖ అంత దూరం వెళ్లే అవకాశం ఉందా..!?
సీఎం జగన్ రాసిన లేఖ చూసుకుంటే అంత దూరం వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. ఆ లేఖలో ఎక్కువగా రమణ వ్యక్తిగత అంశాలున్నాయి. కొన్ని జ్యుడీషియరీ అంశాలు కూడా ఉన్నాయి. అయితే వీటిని ప్రధాన న్యాయమూర్తి ఎంత వరకు పట్టించుకుంటారు అనేది కీలకం. ఇలా ఒక సీఎం… ఒక న్యాయమూర్తిపై ఆరోపణలు చేస్తూ లేఖ రాయడం ఇదే తొలిసారి. బయటకు రావడం లేదు కానీ.. దీనికి న్యాయవ్యవస్థ గిలగిలా కొట్టుకుంటుంది. అంతర్గతంగా చాల చర్చలు జరిగాయి. తప్పులపై ఒక అంతఃసమీక్ష చేసుకునే వరకు వెళ్ళింది. అది ఆ దశలో ఉండగానే.. ఈ అస్త్రాన్ని బీజేపీ తన చేతిలోకి తీసుకుంది. అందుకె ఈ లేఖ పర్యవసానాలు, పరిణామాలు మనం పైన చెప్పుకున్నట్టు బీజేపీ చేతిలోనే ఉంటాయి. చూస్తూ ఉండడమే మన పని..!!