పింకు పరిమళిస్తుందా..? కాషాయం మెరుస్తుందా…!?
సుజాతకు సానుభూతి కలిసొస్తుందా..? రఘుకి కల నెరవేరుతుందా..? కాంగ్రెస్ సంచలనం సాధిస్తుందా..?? దుబ్బాకలో ఏం జరగనుంది..? ఉప ఎన్నికల గ్రౌండ్ రిపోర్ట్ “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకంగా అందిస్తుంది..!
దుబ్బాక ఎన్నికల గురించి సింపుల్ గా చెప్పుకోవాలి అంటే “టీఆరెస్ గెలిస్తే సానుభూతి కారణం.., ఓడితే హరీష్ కారణం”..!! “బీజేపీ గెలిస్తే రఘు కష్టం కారణం.. ఓడితే పార్టీ కారణం”..! “కాంగ్రెస్ గెలిస్తే సంచలనం.. ఓడితే బోడిలింగం”..!! ఇదీ పరిస్థితి. ఓసారి దుబ్బాక వెళ్లి, క్షేత్ర పరిస్థితులను తెలుసుకుని వద్దాం..!!
“2017 నంద్యాల ఉప ఎన్నికకు.. ఈ దుబ్బాక ఉప ఎన్నికకు పెద్దగా తేడా లేదు. అధికార పార్టీ చీకటి రాజకీయాలకు నాడు నంద్యాల, నేడు దుబ్బాక వేదికలుగా మారాయి. ఇంకా లోతుగా చెప్పాలంటే నాడు నంద్యాలలో టీడీపీ అభ్యర్థిని గెలిపించడానికి టీడీపీ మంత్రులు ముగ్గురు, 12 మంది ఎమ్మెల్యేలు, అధికారులు, పోలీసులు పూర్తిస్థాయిలో పని చేసారు. ధారాళంగా ఖర్చు చేసారు. ఇప్పుడు టీఆరెస్ పరిస్థితి అలాగే ఉంది. సేమ్ ఇద్దరు మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలు, కేటీఆర్ సోషల్ మీడియా కార్యకర్తలు, హరీష్ సొంత వర్గీయులు, పోలీసులు, అధికారులు టీఆరెస్ కోసం పని చేస్తున్నారు. కాస్త ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..!? మూడు రోజుల ముందు నుండి పకడ్బందీగా పంపిణీలు కూడా మొధలాయ్యాయి. కరోనా నిబంధనలు కారణంగా వృద్ధులకు ముందస్తు బ్యాలెట్ ఓటింగ్ అనుమతి ఉంది. దీన్ని టీఆరెస్ బాగా వాడుకుంటుంది. ఇప్పటి వరకు పోలైన ఓట్లలో బయటకు చెప్పలేని సంఖ్య అధికార పార్టీకి పడినట్టు చెప్తున్నారు. సో.. ఇదీ అక్కడ అధికార పరిస్థితి. ఇంకొంచెం లోతుగా చూద్దాం..!!
బీజేపీకి ఊపొచ్చినట్టే..!!
ఈ ఉప ఎన్నికలో టీఆరెస్ కచ్చితంగా గెలుస్తుందని మొదటి నుండి ఒక అంచనా ఉండేది. సానుభూతి, అధికారం, హరీష్ హవా కలిసి వస్తాయని భావించారు. కానీ బీజేపీ నుండి అధికార పార్టీ అనుకోని పోటీ ఎదుర్కొంది. ప్రచారం, టీఆరెస్ వ్యతిరేకతను జనంలోకి తీసుకువెళ్లడం, తాను రెండు సార్లు ఓడిపోయానన్న సెంటిమెంట్ రగిలించడం” ఇవన్నీ రఘుకి బాగా కలిసివచ్చాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లో బీజేపీకి అనుకోని ఫలితం రాకపోయినా… తెలంగాణాలో తమకు తిరుగులేదు, ప్రతిపక్షం లేదు అనుకుంటున్నా కేసీఆర్ కి చుక్కలు చూపించడంలో మాత్రం బీజేపీ విజయవంతమైంది. ఏపీలో రాజకీయల్లాగా అక్కడ కూడా వ్యక్తిగత దూషణలు, సిల్లీ ఆరోపణలు వరకు వెళ్లారు. మత రాజకీయాలు మొదలెట్టారు. అక్కడ కేసీఆర్ గాలి మొదలయ్యాక ఒక ఉప ఎన్నిక టీఆరెస్ కి ఇంతగా చెమటలు పట్టించడం ఇదే తొలిసారి అనోకోవచ్చు.
* ప్రచారం చివరి రోజున అయితే ఒకరిపై ఒకరి ఆరోపణలు పీక్స్ కి వెళ్లాయి. తెలనగానలో, హైదరాబాద్ లో మతాల మధ్య కలహాలు సృష్టించి.., గొడవలు చేసి.. దుబ్బాక ఎన్నికల్లో లబ్ధిపొందాలని బీజేపీ చూస్తుంది అంటూ కేటీఆర్ పెద్ద బాంబు పేల్చారు.
* టీఆరెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని, దుబ్బాకలో గెలిచిన వెంటనే రాష్ట్రంలో టీఆరెస్ పని పడతాం అంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యలు ఘ్తా పుట్టించాయి. ఇలా బీజేపీ టీఆరెస్ మధ్య నువ్వా నేనా అనే రీతిలో ప్రచారం మొదలయింది, ముగిసింది.
దుబ్బాక గురించి క్లుప్తంగా..!!
దుబ్బాక ఉమ్మడి మెదక్ జిల్లాలో కీలక నియోజకవర్గం. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నా ఈ నియోజకవర్గంలో ఎక్కువగా రెడ్డి సామాజికవర్గం హవానే కనిపిస్తుంది. మొదటి నుండి ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉంది. అందుకే టీఆరెస్ వరుసగా గెలుస్తుంది. రాష్ట్ర విభజనకు ముందు 2009 లో చెరుకు ముత్యం రెడ్డి గెలిచారు. తర్వాత వరుసగా టీఆరెస్ గెలుస్తుంది.
మొత్తం ఓటర్లు : 198807 : పోలింగ్ కేంద్రాలు 315 :
2018 లో 85 . 92 శాతం పోలింగ్ నమోదయింది. ఇప్పుడు పోలింగ్ శాతం పెంచాలని బీజేపీ భావిస్తుండగా.. తగ్గితే బాగుంటుందని టీఆరెస్ భావిస్తుంది.