నాడు విజయ దశమని నాడే అమారావతిలో భూమిపూజ
అన్నింటికీ..అందరికీ అదే సమాధానంగా…
ఏపీ మూడు రాజధానుల వ్యవహారం పైన ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు చట్టంగా రూపాంతరం చెందాయి. అయితే, దీని పైప అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించటంతో..ఈ నెల 14వ తేదీ వరకు స్టేటస్ కో మెయిన్ టెయిన్ చేయాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వం ఈ నెల 16న విశాఖలో పరిపాలనా రాజధానికి శంకుస్థాపనకు సిద్దం అవుతోంది. ఈ మేరకు ప్రధానిని ఆహ్వానించేందుకు అప్పాయింట్ మెంట్ కోరారు. అయితే, సమయం తక్కువగా ఉండటం..కోర్టులో స్టేటస్ కో ఉండటంతో..దసరా నాటికి ప్రభుత్వం శంకుస్థాపన ముహూర్తం ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ లోగా కోర్టు పరంగా న్యాయ పరమమైన ఇబ్బందులు తొలిగించుకోవటంతో పాటుగా..ప్రధానిని కలిసి నేరుగా అదే రోజు శంకుస్థాపనకు రావాలని..వీలు కాకుంటే వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా హాజరయ్యేలా ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి ప్రధానిని ఆహ్వానించనున్నారు. ప్రధాని కార్యాలయం నుండి స్పష్టత రాగానే ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
దసరా నాడు ప్రధాని చేతుల మీదుగా..
ఏపీలో నూతన పరిపాలనా రాజధానిగా విశాఖకు ప్రధాని చేతుల మీదుగా భూమిపూజ చేయించాలని ముఖ్యమంత్రి జగన్ డిసైడ్ అయ్యారు. వాస్తవంగా ఇప్పటికే మూడు రాజధానుల చట్టం అమల్లోకి రాగా.. హై కోర్టు స్టేటస్ కో మధ్యంతర ఉత్తర్వుల కారణంగా అమలు లో న్యాయ పరమైన చిక్కులు ఏర్పడుతున్నాయి. తొలుత ఈ నెల 16న విశాఖలో కొత్త పరిపాలనా రాజధానికి భూమిపూజకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, హైకోర్టు లో వచ్చిన స్టేటస్ కో ఉత్తర్వుల తో ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. అయినా..అక్కడ ఇంకా విచారణకు బెంచ్ మీదకు రాలేదుద. ఇదే సమయంలో ప్రధాని తో శంకుస్థాపన చేయించటం ద్వారా అన్ని విమర్శలకు..అన్ని పార్టీలకు ఈ కార్యక్రమం ద్వారా సమాధానం చెప్పినట్లవుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో..ఇప్పటికిప్పుడు సమయం తక్కువగా ఉండటం.. న్యాయ పరమైన చిక్కులు ఉండటంతో.. విజయ దశమి నాడు విశాఖలో భూమి పూజకు తాజాగా ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీని ద్వారా సమయం దొరుకుతుందని..ప్రధానిని స్వయంగా ఆహ్వానించే అవకాశం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కేంద్రం ఇప్పటికే హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమని చెప్పటం ప్రభుత్వానికి కలిసి వచ్చింది. ఇక, ప్రధాని కార్యక్రమానికి హాజరు కావటం ద్వారా విశాఖ ఏపీ పరిపాలనా రాజధాని అనే అంశానికి మరింత సానుకూల ప్రచారం లభిస్తుందనేది ప్రభుత్వ అంచనా.
చంద్రబాబు హాయంలోనూ ఇదే ముహూర్తం..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే విజయ దశమి ముహూర్తాన 2015, అక్టోబర్ 21న అమరావతిలో శంకుస్థాపన జరిగింది. ప్రధాని మోదీతో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..కేంద్ర మంత్రులు ఆనాడు అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, ఆ తరువాత టీడీపీ…బీజేపీ మధ్య పొత్తు తెగిపోయింది. ఇక, అమరావతి విషయంలో టీడీపీ భారీ స్థాయిలో అవినీతికి పాల్పడిందనేది వైసీపీతో పాటుగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అటువంటి అమరావతి నుండి విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించటానికి కేంద్రం వ్యతిరేకం కాదనే విషయం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ స్పష్టం చేస్తోంది. కొందరు బీజేపీ నేతలు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పైన సన్నాయి నొక్కులు నొక్కటం..టీడీపీ అధినేత చేస్తున్న విమర్శల నడుమ ప్రధానిని ఆహ్వానించాలని పట్టుదలతో ఉన్న సీఎం ఈ కారణంతోనే విజయ దశమిని ముహూర్తంగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ లోగా న్యాయ పరంగా చిక్కులు తొలిగిపోయేలా ప్రభుత్వం కోర్టుల్లో వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక, అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తున్న వేళ..విశాఖ లో శంకుస్థాపనకు ప్రధాని మోదీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా హాజరయితే ఏపీ రాజకీయాల్లో వైసీపీకి ముఖ్యంగా జగన్ కు కలిసొచ్చే అంశంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.