ఏపీ రాజకీయాలు చూసీ.., విని.. బోర్ కొట్టిందేమో.. ఏపీకి మించిన మలుపులు.., తన్నులాటలు.., కుట్రలు.. కుర్చీలాటలు గ్రేటర్ లో జరిగిపోతున్నాయి. ఒకే పార్టీలో కొత్త కొత్త నాయకులతో చకచకా పావులు కదిలిపోతున్నాయి. ఇద్దరు మంత్రుల కోడళ్ళు కూడా అవేమిటో చూసేయాల్సిందే..!
గ్రేటర్ ఎన్నికల హోరు ఈ నెల నుండే మొదలుకానుంది. ఫిబ్రవరిలోగా ఎన్నికల తంతు పూర్తి చేస్తామని ఎన్నికల సంఘం పేర్కొనడంతో డిసెంబర్ రెండోవారంలో పోలింగ్ నిర్వహించే వీలున్నట్టు సమాచారం అందుతుంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారయ్యాయి. కొందరు ప్రచారం కూడా మొదలెట్టేసారు. ఇంకొందరు పంపిణీకి నిధులు కూడా (వరద సాయం నొక్కేసి) సిద్ధం చేసుకున్నారు. మరి గ్రేట్ మేయర్ అంటే టీఆరెస్ జేబులో ఉన్నట్టే. తెలంగాణ సెంటిమెంట్, అధికారం, కేటీఆర్ హవా కలిసి గ్రేటర్ లో టీఆరెస్ పగ్గాలు ఖాయమే. అయితే మేయర్ ఎవరు..? అనేది మాత్రమే ఇప్పుడు తేలాల్సిన అంశం..!
ఆ కుర్చీ చుట్టూ ఏడుగురు పోటీలో..!!
గ్రేటర్ మేయర్ పీఠం ఈసారి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. సో.. పెద్ద పోటీనే నెలకొంది. మహానుమహులు అందరూ కేటీఆర్ చుట్టూ తిరుగుతున్నారు. మా దగ్గర ఇంత ఉంది..? మేము ఇలా చేస్తాం..! మేము అంత ఇచ్చేస్తాం..? అంటూ కేటీఆర్ దగ్గరకు రాయ”బేరాలు” నడుపుతున్నారు. వారిలో కీలకంగా..!!
* మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈసారి తన భార్య శ్రీదేవిని మేయర్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే ఆయన స్టైల్ లో రాజకీయం మొదలెట్టేసారు. మూడు నెలల కిందట యువరాజు కేటీఆర్ పుట్టినరోజుకి భారీస్థాయిలో బిస్కట్లు కూడా వేస్తూ సినిమాటిక్ గా ఒక పాట చేయించి, స్వయంగా స్టెప్పులేశారు.
* మంత్రి తలసాని కూడా ఈ పోటీలో ఉన్నారు. ఆయన కుమారుడు సాయికిరణ్ ని ఎంపీ చేయాలనుకుని బొక్కబోర్లా పడ్డారు. అందుకే తన కోడలి(సాయి కిరణ్ భార్య)ని మేయర్ చేయాలనుకుంటున్నారు. అందుకే ఈయన కూడా ఇప్పటి నుండి ప్రయత్నాలు మొదలు పెట్టారు. కేటీఆర్ దగ్గర లాబీయింగులు వేసుకొస్తున్నారు.
* తలసాని సహచరుడే మరో మంత్రి మల్లారెడ్డి కూడా తన కోడలికి మేయర్ పదవి ఇవ్వాలని ఉవ్విల్లూరుతున్నారు. కుమారుడు ధర్మారెడ్డి భార్యకి మేయర్ అవకాశం కల్పించాలంటూ ఇప్పటి నుండి ఆయన రాయబారాలు నడుపుతున్నారు.
* డిప్యూటీ మేయర్ ఫసీదుద్దిన్ భార్య షేక్ సహీన కూడా ప్రయత్నాలు ఆరంభించారు. ఎంతకాలం డిప్యూటీగా ఉంటాం.. ఈ సారి మేయర్ అవ్వాల్సిందే అంటూ ఈయన కూడా తన ప్రయత్నాలు మొదలు పెట్టేసారు.
* సామాన హేమ అని మరో కార్పొరేటర్ కూడా సిద్ధమవుతున్నారు. ఈమె కేసీఆర్ ముద్దుల తనయ కవిత, కేటీఆర్ ద్వారా విపరీత ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఐదుగురితో పాటూ మరో ఇద్దరు కీలక నేతల మహిళలు కూడా కేటీఆర్ చుట్టూ తిరుగుతున్నారు.
సోషల్ ప్రచారం మొదలు..!!
అటు గ్రేటర్ ఎన్నికల అంటే సోషల్ మీడియాలో చురుకవ్వాలి కదా.!? అందుకే ఈ నెల రోజుల వ్యవధిలోనే చాల మంది మహిళా నేతలు కొత్తగా ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలు ఏర్పాటు చేసుకుని, ప్రమోట్ చేసుకుంటున్నారు. కేటీఆర్ కి ట్వీట్లు, రీ ట్వీట్లు చేస్తూ.. ఉనికి కోసం పాకులాడుతున్నారు. సామాన హేమ, బొంతు శ్రీదేవి, షేక్ సహీన వంటి మహిళా నేతలు రాత్రికి రాత్రే సోషల్ మీడియా ఖాతాలకు లక్షల్లో ఫాలోయర్లు వచ్చి చేరారు అంటే మాటలు కాదు కదా..!? అది గ్రేటర్ మహిమ. ఇంకా చూద్దాం. గ్రేటర్ రాజకీయంపై మరిన్ని ఆసక్తి కథలు, కథనాలు చెప్పుకుందాం..!!