ఢిల్లీ సాక్షిగా ఎంపీల మూడు ముక్కలాట
టీడీపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్ మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు టీడీపీ నేతలకు పెద్ద పజిల్ గా మారింది. టీడీపీ అధినేత అమరావతిలోనే రాజధాని కొనసాగాలని కోరటం.. ప్రతీ రోజు అదే డిమాండ్ చేస్తుండటం ఉత్తరాంధ్ర..రాయలసీమ ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలకు సంకటంగా మారింది.
మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర పడిన వెంటనే రాజీనామాల దిశగా టీడీపీలో చర్చ సాగింది. అయితే, ఆ రెండు ప్రాంతాల నేతలు కలిసి వచ్చే పరిస్థితి లేదనే సంకేతాలతో వెనుకడుగు వేసి సాధ్యం కాని అసెంబ్లీ రద్దు డిమాండ్ తెర మీదకు తెచ్చారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలే కాదు పార్టీ నుండి గెలిచిన ముగ్గురు ఎంపీల తీరు పైన పార్టీలో చర్చ సాగుతోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు అమరావతి ప్రాంత పరిధిలోని నియోజకవర్గాల నుండి గెలవగా..మరొకరు ఉత్తరాంధ్ర నుండి గెలుపొందారు. కానీ, రాజధాని పైన చంద్రబాబు ప్రతీ రోజు ఇంతలా ఆవేదన వ్యక్తం చేస్తుంటే..ఈ ముగ్గురి తీరు మాత్రం పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. దీంతో..ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాల పైన టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు. ఇంతకీ..ఈ ముగ్గురు ఎంపీలు ఇప్పుడు ఎందుకు చర్చకు కారణమయ్యారు….
ముగ్గురు ఎంపీలు తలోదారి…
టీడీపీ నుండి రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆరుగురిలో నలుగురు బీజేపీలో చేరిపోయారు. వారిలో ఒకరు పదవీ విరమణ చేసారు. టీడీపీలోనే కంటిన్యూ అయిన ఇద్దరిలో మరో మహిళా ఎంపీ సైతం పదవీ కాలం ముగిసింది. ఇక, ఇప్పుడు ఒక్కరే ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి లోక్ సభకు ముగ్గురు ఎన్నికయ్యారు. ముగ్గురూ రెండో సారి ఎంపీలుగా గెలిచిన వారే. అందులో గల్లా జయదేవ్ కు లోక్ సభలో పార్టీ ఫ్లోర్ లీడర్ గా చంద్రబాబు ఎంపిక చేసారు. ఆ నిర్ణయం పైన విజయవాడ ఎంపీ కేశినేని నాని పరోక్షంగా వ్యతిరేకించారు. ఇక..ముగ్గురు కొన్ని సందర్భాల్లో ఒక్కటిగా నిలుస్తున్నా..ఇప్పుడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర తరువాత మాత్రం వారు ముగ్గురు గతంలో వలే స్పందించటం లేదు. ప్రధానంగా గల్లా జయదేవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు లోక్ సభ పరిధిలోనే అమరావతి ఉంది. గతంలో అమరావతి రైతుల వద్దకు జయదేవ్…ఆయన తల్లి అరుణ వచ్చి మద్దతు తెలిపారు. ఇక, అసెంబ్లీలో రాజధాని బిల్లులు ఆమోదిస్తున్న సమయంలో అసెంబ్లీకి ముట్టడికి ప్రయత్నించిన జయదేవ్ కు పోలీసుల ట్రీట్ మెంట్ వివాదస్పదమైంది. ఆ సమయంలో పార్టీ నుండి ఆశించిన మద్దతు లేదనే బాధ జయదేవ్ లో ఉండిపోయింది. దీంతో..మిగిలిన నేతలు పేపర్ స్టేట్ మెంట్స్ కే పరిమితం అవుతున్న సమయంలో తాను రిస్క్ తీసుకోవటం ఎందుకునే భావనలో ఉన్నారు. అందులోనూ జయదేవ్ కు సంబంధించిన సంస్థకు చెందిన భూముల విషయంలో జగన్ సర్కార్ సీరియస్ గా ఉంది. దీంతో..జయదేవ్ ఈ మధ్య కాలంలో అమరావతి దరి దాపుల్లోకి రావటం లేదు. హైదరాబాద్ లోనే ఉంటూ అప్పుడప్పుడూ ప్రెస్ నోట్ల ద్వారా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది పార్టీలో..ప్రధానంగా చంద్రబాబుకు మింగుడు పడటం లేదని పార్టీలోనే ప్రచారం సాగుతోంది.
అధినేతకు దూరంగా ఉండటం వెనుక…
మిగిలిన ఇద్దరు ఎంపీల్లో శ్రీకాకుళం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్మోహన్ నాయుడు పైన చంద్రబాబుకు మంచి అభిప్రాయం ఉంది. కానీ, ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు అరెస్ట్ తరువాత రామ్మోహన్ నాయుడు వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అచ్చెన్నాయుడు అరెస్ట్ అయి రెండు నెలలు పూర్తయినా..ఇంకా బెయిల్ రాలేదు. ఆయన ఢిల్లీలోని బీజేపీ నేతలతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం టీడీపీలో బలంగా వినిపిస్తోంది.
టీడీపీకి విధేయులుగా ఉండే కింజరపు కుటుంబంలో ఇప్పుడు కొత్త ఆలోచనలు మొదలైనట్లు చెబుతున్నారు. ఉత్తరాంధ్రకు రాజధాని వస్తుంటే వ్యతిరేకించటానికి రామ్మోహన్ నాయుడు సిద్దంగా లేరు. ఆయన ఎక్కడా ఈ మధ్య కాలంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ఇక, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పటికే స్పష్టమైన అభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. పేపర్ స్టేట్ మెంట్లతో మన కలలు తీరవని..2019లో అధికారంలోకి రావటంతోనే అమరావతి సాధ్యమవుతుందని ఆయన చేసిన ట్వీట్ తో ఆయన అమరాతి విషయం లో చాలా స్పష్టంగా ఉన్నారు.
కేశినేని నాని పరోక్షంగా చంద్రబాబును బెజవాడ పార్టీ నేతలను ఉద్దేశించి ఈ కామెంట్లు చేసారనేది పార్టీలో ప్రచారం. ఇక, ఈ ముగ్గురూ రాజధానుల వ్యవహారంలో పార్టీ అధినాయకత్వా నికి మద్దతు ఇవ్వకపోగా..ఢిల్లీలో మాత్రం కేంద్ర పెద్దలతో మంచి రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేస్తున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. దీంతో…ఇప్పుడు మాజీలు మినహా ప్రస్తుత టీడీపీ ప్రజా ప్రతినిధులు ఏకపక్షంగా చంద్రబాబుకు మద్దతిచ్చే పరిస్థితి కనిపించటం లేదు. ఈ ముగ్గురు ఎంపీల తీరు సైతం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?