వంశీకి మాట నెగ్గడం లేదు. కరణంకి పెత్తనం రావడం లేదు. గిరికి పట్టు దొరకడం లేదు. శిద్దాకు కనీసం గౌరవం అందడం లేదు. అవినాష్ కి అపాయింట్మెంట్ చిక్కడం లేదు. వీళ్ళందరూ టీడీపీలో రాజుల్లాగా ఉండేవారు. అనుకున్నది చేసేవారు. ఆయా జిల్లాల్లో పార్టీని ఒంటికన్నుతో నడిపించేవారు. ఇప్పుడు కనీసం జగన్ అనే మొహం చూడడానికి, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా మొహం వాచేలా ఎదురు చూస్తున్నారు..!! చేరి తప్పు చేశామా..? అనేంతగా అంతర్మథనంలో ఉన్నారు. ఒక్కో చోటా ఒక్కోలా.., ఒక్కొక్కరికీ ఒక్కోలా ఇబ్బందులు తప్పడం లేదు. అందుకే “మేం వచ్చి తప్పు చేసాం. మీరు ఆగండి, తొందర వద్దు” అంటూ చీకటి కబుర్లు పంపుతున్నారట. పైగా నిఘా వర్గాల హెచ్చరికలు కూడా జగన్ ని అప్రమత్తం చేశాయట. అందుకే ఆకస్మికంగా వలసలు ఆగాయని టాక్..!!
జగన్ కి జై కొట్టేసాం.., అధికార పార్టీలోకి చేరిపోయాం.., ఇక తిరుగులేదు. చక్రం తిప్పేయొచ్చు. తమదే పట్టు, హవా అనుకున్న నేతలకు ఇప్పుడిప్పుడే ఆ చిక్కులు అర్ధమవుతున్నాయి. చుక్కలు కనిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి టీడీపీకి చెందిన చాలా మంది జగన్ కి జై కొట్టారు. ముగ్గురు ఎమ్మెల్యేలు, మాజీలు, నియోజకవర్గాల ఇంచార్జిలు కూడా వైసీపీలోకి మారిపోయారు. టీడీపీలో స్వేచ్ఛగా, ఇష్టానుసారంగా ఉన్న ఈ నాయకులకు ఈ పార్టీలో మాట సాగక, అనుకున్నది అవ్వక, శ్రేణుల్లో నైరాశ్యంతో అటూ, ఇటూ కాక ఊగిసలాడుతున్నారని తెలుస్తుంది. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకోవచ్చు..!!
వంశీకి స్థానిక పోరు..!!
గన్నవరం నియోజకవర్గం ప్రత్యేకమైనది. టీడీపీ నుండి వంశీ వరుసగా రెండు సార్లు గెలిచారు. సొంత పార్టీపై నమ్మకం లేక, వారితో పొసగక వైసిపిలోకి దూకేశారు. కానీ ఆయనకు ఆ నియోజకవర్గ వైసీపీ నేతల నుండి తలపోటు తప్పడం లేదు. 2014 లో వంశీ చేతిలో ఓడిపోయినా దుట్టా రామచంద్రరావు, 2019 లో వంశీ చేతిలో ఓడిపోయినా వెంకట్రావు ఇద్దరూ వంశీ రాకపై ఆగ్రహంతోనే ఉన్నారు. ఈ ఇద్దరూ జగన్ కి కావాల్సిన వారు. దుట్టా అయితే జిల్లాలో సీనియర్ నేత. వైఎస్ ఉన్నప్పటి నుండి ఆయనతో కూడా చనువుగా ఉండేవారు. 2019 లో టికెట్ ఇవ్వలేదు సరికదా.., తర్వాత వంశీని కూడా పార్టీలోకి తీసుకోవడంపై ఆయన తీవ్రంగా రగిలిపోతున్నారు. అలా అని జగన్ కి, వైసిపికి వ్యతిరేకంగా లేరు. వంశీని ఏమాత్రం వైసిపిలో స్వేచ్ఛగా ఉండకుండా చేస్తున్నారు. ఇటు వెంకట్రావు వర్గం కూడా వంశీకి సవాల్ విసురుతుంది. రెండు వైపులా రెండు వ్యతిరేక వర్గాల తలనొప్పులతో వంశీ సతమతమవుతున్నారు. కనీసం అధికార పార్టీలో చేరాము, మాట సాగుతుంది, పనులు జారుతాయి అనేడి నెరవేరడం లేదు.
కరణం కి ఆమంచితో పోరు..!!
చీరాల నియోజకవర్గం మరింత ప్రత్యేకమైనది. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆమంచి 2019 లో ఓడిపోయారు. టీడీపీ నుండి అనూహ్యంగా బరిలోకి దిగిన కరణం బలరాం గెలిచారు. నాన్- లోకల్ అనే మాట కూడా లేకుండా గెలిచేసారు. కానీ ఏం ప్రయోజనం..? రాష్ట్రంలో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. అందుకే ప్రతిపక్షంలో ఉండలేక, అధికారానికి జై కొట్టారు. నాటి నుండి చీరాలలో పూర్తి పెత్తనం కావాలంటూ వైసీపీ పెద్దలను కలుస్తున్నారు. కానీ నో యూజ్. నాడు వైసీపీలో చేరిన సందర్భంగా జగన్ ని కలిసిన ఈ తండ్రి కొడుకులకు మళ్ళీ జగన్ అపాయింట్మెంట్ దొరకలేదు. వల్లభనేని వంశీ అయితే నిత్యం చంద్రబాబుని, లోకేష్ నీ చెడుగుడు ఆడుతున్నారు. అయినా జగన్ నమ్మకం పూర్తిగా గెలవలేకపోతున్నారు. కానీ చీరాలలో కరణం బలరాం కానీ, వెంకటేష్ కానీ టీడీపీని, చంద్రబాబునీ ఏమి అనడం లేదు. సాధారణంగానే నాయకులను పెద్దగా నమ్మని జగన్ నమ్మకాన్ని వీరు గెలుచుకోవాలి అంటే ఇప్పట్లో అసాధ్యమే. మరోవైపు ఆమంచి మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా టీడీపీని, చంద్రబాబుని, ఆ సామాజికవర్గాన్ని ఉతికారేస్తుంటారు. అందుకే జగన్ కి నమ్మకస్తుడిగా ఉన్నారు.
తాజాగా వైఎస్ వర్ధంతి సందర్భంగా ఇరువర్గాలు వివాదానికి దిగడం.., వెంకటేష్ ఘాటు వ్యాఖ్యలు చేయడం, ఆమంచి పార్టీ పెద్దలకు పిర్యాదు చేయడం ఈ నియోజకవర్గ వేడి వేడి అంశాలు.
గిరికి ఇష్టంగానే… సౌఖ్యంగానే..!!
పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఎవరైనా కాస్త సంతోషంగా, స్వేచ్ఛగా ఉన్నారంటే అది కేవలం మద్దాల గిరి మాత్రమే. అనుకోకుండా టీడీపీ సీటు సాధించిన ఆయన అంతే అనుకోకుండా గెలిచేసారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చలవతో , ఆ గాలితో, ఆయన ఖర్చుతో గిరి పోటీ చేయడం, గెలవడం జరిగిపోయింది. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం ఓట్లు ఎక్కువ. అందుకే టీడీపీ గాలి లేకపోయినా జయదేవ్, లోకేష్ ప్రత్యేక వ్యూహాలతో గిరి గెలిచారు. ఇక తనకి సీటు రాదని, తాను గెలవనని ముందుగానే నిర్ణయానికి వచ్చేసిన గిరి పార్టీ అధికారాన్ని వాడుకుని వెనకేసుకునే ఆలోచనలో పడ్డారు. అందుకే వివాదాల జోలికి పోకుండా పెత్తనం కోరకుండా కలిసి చేసుకుంటున్నారు. ఈయనకు పెద్దగా సొంత వర్గం కూడా లేదు.
పాపం శిద్దా… కదిరి..??
ఇక టీడీపీలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన శిద్దా రాఘవరావు రాజకీయం అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది. వివాదరహితుడు, నెమ్మదస్తుడు అయిన శిద్దా వ్యాపార ప్రయోజనాల కోసం కాంప్రమైజ్ అయ్యి వైసీపీలో చేరారు. నిజానికి శిద్దాకు ఇష్టం లేకపోయినా కుమారుడి ఒత్తిడి కారణంగా ఈ చేరిక జరిగిందని అంటుంటారు. టీడీపీలో ఉన్నప్పుడు జిల్లా స్థాయిలో చక్రం తిప్పారు. పార్టీలో ఆయన మాటకు గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు వైసీపీలో కనీసం ఆటలో అరటిపండులా కూడా లేరు. వైసీపీలో ఆయనకు అంటూ సొంత నియోజకవర్గం లేదు. టీడీపీలో ఉన్నప్పుడు ప్రాతినిధ్యం వధించిన దర్శి నుండి ఏ పార్టీ నాయకులు ఆయన్ను పట్టించుకోవడం లేదు. కనీసం నామినేటెడ్ పదవి ఇస్తారన్న.., జగన్ మళ్ళీ మాట వరుసకైనా మాట్లాడడం లేదు. పాపం శిద్దా..!! వ్యాపారం, వ్యవహరం కోసం పట్టు జారీ, మెట్టు దిగి ప్రభావం కోల్పోయారు. * ఇదే కోవలోకి కదిరి బాబురావు కూడా వస్తారు. టీడీపీ అధినేతకు, బాలకృష్ణకి అత్యంత దగ్గరైన కదిరి బాబురావు గత ఎన్నికల్లో కనిగిరి సీటు ఇవ్వకపోవడంతో పార్టీపై అలిగారు. ఆ అలక పీక్స్ కి చేరి, ఆరు నెలల కిందట వైసీపీలో చేరారు. ఈయనకు సొంత నియోజకవర్గం అంటూ లేదు.
అందుకేనా చేరికలు ఆగాయి..!?
ఇక అసలు విషయానికి వద్దాం..! జగన్ ఎవర్నీ పెద్దగా నమ్మరు, ఎవరిపై ఆధారపడరు. ఆయన నమ్మకాన్ని గెలుచుకునే క్రమంలోనే అనేక మంది నాయకులు జగన్ భజన చేస్తూ, టీడీపీని ఘాటుగా విమర్శిస్తూ ఉంటారు. జగన్ నమ్మే వరకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. పైగా ఇప్పుడు చేసిన నాయకులు అందరూ వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చేరారు అని (శిద్దాకి గ్రానైట్.., వంశీకి భూముల కేసు.., కరణంకి భూమి గొడవ, కోర్టు కేసు వంటివి) జగన్ బాగా తెలుసు. అందుకే వీళ్ళను ప్రస్తుతానికి దగ్గరకు రానీయడం కష్టమే.
చివరిగా మూలాల్లోకి వెళ్లాలంటే..!!
కృష్ణా జిల్లాలో పేరు మోసిన కమ్మ సామాజిక వర్గానికి దేవినేని నెహ్రు కుటుంబం(అవినాష్), అటు వల్లభనేని వంశీ ప్రతినిధులుగా ఉన్నారు. ఇటు ప్రకాశం జిల్లాలో అదే సామజిక వర్గానికి కరణం బలరాం పెద్దన్న లాంటి వారు. ఆయా జిల్లాల్లో వారికి ఆదరణ బాగుంటుంది, పార్టీకి యూజ్ ఉంటుంది అని జగన్ చేర్చుకున్నారు. “వైసీపీ అంటే టీడీపీ వ్యతిరేకి. టీడీపీ అంటే కమ్మ సామాజికవర్గం.. తద్వారా వైసీపీ కూడా ఎంతో కొంత కమ్మ వ్యతిరేకం కాబట్టి ఆ సామజికవర్గ వ్యతిరేకులు అనేక మంది ఆయా జిల్లాలో జగన్ కి మద్దతు పలికారు. వీరి చేరిక ద్వారా కొంత నష్టం వచ్చినా దాన్ని సర్దుకోవచ్చు అని జగన్ భావించారు. కానీ ఈ చేరికల ఫలితంగా జగన్ ఊహించిన కంటే అధికంగా నష్టం వస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. వైసీపీలోనే ఇతర వర్గాలు అసంతృప్తిలో ఉన్నట్టు, ఈ ప్రభావం పార్టీపై ఎక్కువగా ఉన్నట్టు తెలుసుకుని ఇక చేరికలు ప్రత్సాహించకూడదు అని జగన్ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇటువంటి పరిస్థితుల్లో అటు వంశీ, ఇటు కరణం మధ్యలో అవినాష్ లాంటి వారికి జగన్ నమ్మకాన్ని పూర్తిగా గెలుచుకుని, ఆ నియోజకవర్గాల్లో వారిపైనే ఆధారపడేలా చేయడం కష్టమే. వీరి భవితని, కాలమే నిర్ణయించాలి.