స్వయానా సీఎం కి అమ్మ… మాజీ సీఎం కి భార్య… ఒక పుస్తకం రాశారు. ఘనంగా విడుదల చేశారు. మంచి పేరు వచ్చింది. ఘనంగా రెండు రోజుల్లోనే వేలల్లో అమ్ముడయ్యాయి. ఇంకా ఆర్డర్లు ఉన్నాయి. అంతా బాగుంది, బాగుంది అంటూ మళ్ళీ మళ్ళీ కొంటున్నారు. ఈ లోగా ఒక బాంబు పడింది. పుస్తకం పైరసీ అయింది. సోషల్ మీడియాలో ప్రవేశమైంది. అనధికారికంగా వేలాది మందికి చేరిపోయింది. ఇంకేముంది పబ్లిషర్ల గోలా మొదలయింది. వెంటనే ప్రభుత్వం తేరుకుంది.
“నాలో… నాతో… వైఎస్సార్” పుస్తకం రెండు రోజుల కిందట విడుదలయింది. ఇప్పుడిప్పుడే వేల కొద్దీ అర్దర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో రెండు వారాలు పాటూ ఇదే ఊపు కొనసాగుతుంది, కనీసం లక్ష పుస్తకాలు అమ్మేస్తాం అనుకున్న దశలో పబ్లిషర్లకు దిమ్మ తిరిగింది. నిన్న రాత్రికి అనేక వాట్సాప్ గ్రూపులో ఈ పుస్తకం ప్రత్యేక్షం అయింది. సోషల్ మీడియా సంగతి చెప్పేదేముంది.., ఒకరి నుండి ఒకరికి విపరీతంగా వ్యాప్తి అయిపోయింది. లక్షలాది మందికి అనధికారికంగా చేరిపోయింది. ఇక అర్దర్లు పోయాయి. పుస్తకాల అమ్మకం ప్రభావం పడింది. దీంతో పార్టీ ప్రతినిధిగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటన ఇచ్చారు. అందులో ఏముంది అంటే…”
‘‘నాలో.. నాతో.. వైయస్సార్’’ పుస్తకం పేరుతో పీడీఎఫ్ ఫైల్ను సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. మా పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మగారు రాసిన పుస్తకానికి, దీనికీ సంబంధంలేదు. ఎమెస్కో పబ్లిషర్స్ అచ్చువేసిన పుస్తకమే అసలైన పుస్తకం. ఈ పుస్తకంలోని అంశాలు.. సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న పీడీఎఫ్ ఫైల్లోని అంశాలు వేర్వేరుగా ఉన్నాయి. దురుద్దేశంతో ఈ పీడీఎఫ్ఫైల్ను సర్క్యులేట్చేస్తున్నారు. దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రాష్ట్ర డీజీపీగారికి ఫిర్యాదు చేశాం. వైయస్సార్ అభిమానులు కూడా ఈ అంశాన్ని గమనించాలని కోరుతున్నాను” ఇదీ విషయం. ఇప్పుడు మొదలయింది అనేక అనుమానాల మాలిక.
పీడిఎఫ్ ఇలా బయటకు తీసుకురావాలి అంటే కచ్చితంగా ఈ ఇంటి దొంగల పనే అయి ఉంటుంది. పుస్తకం ప్రింటింగ్ కి ఇచ్చినప్పుడు పబ్లిషర్స్ దగ్గర, లేదా ఆ ఆఫీస్ లో చోరీ జరిగి ఉంటుంది. కంప్యూటర్లోని ఈ కీలక ఫైల్ ని తస్కరించి ఉంటారు. ఒకవేళ ఈ పీడిఎఫ్ వేరు, ఆ పుస్తకం వేరు అనుకున్నా…! పీడిఎఫ్ లో మార్పులు చేయడం సాధ్యం కాదు కదా అనే అనుమానాలున్నాయి. ఇలా పుస్తకం పీడిఎఫ్ గా మార్చింది ఎవరు..? బయటకు లీక్ చేసింది ఎవరు..? వాట్సాప్ లో మొదట పెట్టింది ఎవరు..? నిజంగా మార్పులు జరిగితే అవి చేసింది ఎవరు..?? ఇవన్నీ పెద్ద పని గా మారిపోయాయి. అసలే సీఎం గారికి తల్లి.., మాజీ సీఎం కి భార్య.. ఒక కీలక విషయం వివరిస్తూ పుస్తకం రాశారు. మరి ఈ పైరసీ గోల లేకుండా చేయాల్సిన పోలీసుల బాధ్యత ఉందిగా.., అందుకే ఈ ఫిర్యాదుపై వాళ్ళు ఏ రకంగా ముందుకు వెళ్తారో అనేది సందేహంగా మారింది.