తెలుగు మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. “నక్షత్రాల హోటళ్లలో హుందాగా.., నాలుగు గోడల మధ్య” జరిగే యవ్వారాల నుండి… “రోడ్డు పక్కన టార్చి లైట్లు పెట్టుకుని లారీలు వస్తున్నప్పుడు మొహానికి లైట్లు కొట్టుకునే స్థాయికి(దీనిలో కూడా కులాల వారీగా లైటింగ్ కొట్టడం) దిగజారింది. దీనిలో ఎల్లో, బ్లూ, పింక్, రెడ్డు అనే తేడాలు లేవు.
పరకాల ప్రభాకర్ గురించి ప్రత్యేకంగా తెలియని వాళ్ళ కోసం చెప్పాలి. “లండన్ లో చదువుకున్నాడు. మంచి రచయిత, పాత్రికేయుడు, విశ్లేషకుడు.. హుందాగా జర్నలిజం చేసిన వ్యక్తి” ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో మీడియా సలహాదారుగా.., కేంద్ర మంత్రి నిర్మలమ్మ భర్తగా అందరికీ తెలిసారు.
ఇక తెలుగు మీడియాకి… పరకాల ప్రభాకర్ కి లింకు ఏమిటి అనేది చర్చనీయాంశం.., మనం చెప్పుకోవాల్సిన అంశం..! ఆయన ఈమధ్య “మహాన్యూస్” వాటాదారుడిగా తప్పుకున్నారు. టీవీ లో షేర్లు తీసుకుని, రెండేళ్లు చూసి, విసిగి, మనం పైన చెప్పుకున్న అసలైన ప్రస్తుత జర్నలిజం లోతుని చూసి తప్పుకున్నారు. తప్పుకుంటూనే ఓ లేఖ రాశారు. “వార్త అంటే నిస్పక్షపాతంగా ఉండాలి. ఏ రాజకీయ పార్టీకి, నాయకుడికి బాకా ఊదకూడదు, భజన చేయకూడదు. సాధారణ ప్రజల గొంతుకలు ప్రజలకు వినిపించాలి” అంటూనే “ఛానెల్ రోజువారీ ప్రసారాలపై మనం మూడునెల్లకోసారి చర్చించుకోవడం కంటే రోజువారీ నిర్ణయాలు తీసుకుంటే మంచిది. వార్తని ఎంచుకుని, రాసిన విధానం కూడా మన వైఖరికి తగ్గట్టుగా ఉండాలి. కొత్త పెట్టుబడి దారులు వస్తున్నారు, వారి చేతుల మీద ఛానెల్ నడుస్తే మంచిదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇన్ని చేతుల కంటే ఒక్కరి మీదుగా నడిస్తే ఎవరికీ ఒత్తిడి ఉండదు, అందరికీ మనశాంతి ఉంటుంది. అందుకే నిష్క్రమిస్తున్నాను” అంటూ లేఖలో పేర్కొన్నారు. పనిలో పనిగా “కరోనా కారణంగా నష్టపోయాం, ఆదాయం లేదు అంటూ” ముగింపు ఇచ్చారు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే పరకాల ప్రభాకర్ ఎందుకు మహాన్యూస్ లో దూరారు, ఎందుకు నిష్క్రమించారు అనేదే ఇక్కడ ముఖ్యమైన పాయింటు.
వాడుకున్నారా..? మోసం చేశారా…??
మహాన్యూస్ మొదట ఇనగంటి వెంకట్రావు ప్రారంభించారు. వారి పిల్లలే వట దారులుగా ఉన్నారు. టీడీపీ భజన దారుడిగా విశ్లేషణలు, వార్తలు కొన్నాళ్ళు కొనసాగించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్ళు ఈ ఛానెల్ కి పెద్దగా ఇబ్బందులు లేవు. కానీ వాటాల మార్పు జరిగేది. పెద్దగా ఆదాయమూ లేదు. ఒక సగటు టివి ఛానెల్ సంపాదించే చీకటి కోణంలో లావాదేవీలు జరిగేవి. టీడీపీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఆటుపోట్లు ఆరంభమయ్యాయి. అప్పటి వరకు ప్రధాన వాటాదారుడిగా ఉన్న సుజనా చౌదరి వైదొలిగారు. పరకాల ప్రభాకర్ గత ఏడాదిలో ఎంటర్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఛానెల్ (మోనికా బ్రాడ్ కాస్టింగ్)లో మారెళ్ల వంశి కృష్ణ, ఉమా విజయ్ కుమార్, పరకాల ప్రభాకర్, మూర్తి వాటాదారులుగా ఉండేవారు.
- పరకాల వెనకాల ఉన్న శక్తి ఈ ఛానెల్ మిగిలిన వాటాదారులకు కావాల్సి వచ్చింది. ఆయన స్వయానా కేంద్ర ఆర్ధిక మంత్రికి భర్త. ఇక్కడ స్థానికంగా ఏమైనా రాజకీయ ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొన వచ్చు అనే దూరాలోచనతో ఆయనకు వాటా ఇచ్చారు. చైర్మన్ చేసారు. కానీ పరకాల ఆలోచనలు భిన్నం. ఈయన అనుకున్నది వేరు. పరకాల తాజాగా రెండు రోజుల కిందట వైదొలిగారు. అయితే ఇక్కడే వివాదాలు, వైషమ్యాలు ఎంటర్ అయ్యాయి. ఛానెల్ ని పెద్దగా పట్టించుకునేవారు లేరు. ఆదాయం లేదు. ఛానెల్ లో ప్రసారాలు, పార్టీల రంగులపై విబేధాలు వచ్చాయి.
* పరకాల ప్రభాకర్ ఒక నిఖార్సు జర్నలిస్టు. కాకపోతే పాతకాలం నాటి, చాదస్తపు జర్నలిస్టు. ఈ ఛానెల్ లో ఎంటర్ అయినప్పుడే ఒక తటస్థ వేదికగా… ప్రసారాలను మార్పులు చేసి తన హయాంలో ఉండేలా మాట్లాడుకున్నారట. కానీ కాల క్రమేణా ఆయన మాటకు విలువ లేకపోవడం, తాను ఆశించిన మార్పులు లేకపోవడం కళ్లారా చూసారు. అనవసరంగా వచ్చి మోసపోయానని వేదనలో ఉండగా… ఇదే సమయంలో అనుకోకుండా నష్టాలు వేటాడడంతో ఇక చేసేదేం లేక వైదొలిగారు. ఇప్పుడు ఈ ఛానెల్ లోకి టీడీపీ ముఖ్యులు ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. రానున్న కాలంలో కొన్ని కీలక మార్పులు తప్పకపోవచ్చు.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!