దేశంలో ప్రస్తుతం సంచలన ప్రేమ కథ అంటే తమిళనాడు దళిత ఎమ్మెల్యే.., బ్రాహ్మణా యువతిని పెళ్లి చేసుకున్నారు. ఆ కథ దేశమంతటా వ్యాపించి.., కులాంతర వివాహ చర్చని పెద్దది చేసింది. ఈరోజు తాజాగా ఆమె తండ్రి కోర్టులో పిటిషన్ వేస్తూ.. ఆమె మైనర్ అని పేర్కొన్నాడు…!! ఇది ఇక్కడితో ఆగుతుందా..? కథ సుఖాంతం అవుతుందా..? లేదా కొన్ని ఏళ్ళ కిందట తమిళనాడులో జరిగిన ఘోర ప్రేమ కథల్లా ఉంటుందా..? అనేది సస్పెన్సు గా మారింది..!!
సీన్ – 1 ; ఓ దళిత యువకుడు వీధి చివర మెకానిక్గా పని చేస్తుంటాడు. అదే ఊళ్లో అగ్రవర్ణానికి చెందిన అమ్మాయి. కాలేజీలో చదువుతూనే ఈ యువకుడితో ప్రేమలో పడుతుంది. ఆ యువతికి వేరే పెళ్లి చేస్తారు. ఈ మెకానిక్ ఆమె కోసం పిచ్చోడుగా మారిపోతాడు. కట్ చేస్తే.. ఇది ప్రేమిస్తే సినిమా. భరత్ సంథ్యా హిరో హీరోయిన్లు. అందరికీ తెలిసిన కథే. ఇది తమిళనాడులో నిజంగా జరిగింది..!
సీన్ 2 ; ఓ దళిత యువకుడు. పేరు ఇళవరసన్ ఓ తమిళ దొరల అమ్మాయిని కులాంతర వివాహం చేసుకుంటాడు. అది జరిగిన మరుసటి రోజున ఆ యువకుడు రైల్వే ట్రాక్ పై శవమై కనిపిస్తాడు. 2012 లో తమిళనాడులో జరిగిన ఈ కథ ధర్మపురి ప్రేమ కథగా ఇప్పటికీ చరిత్రలో ఉంది. ఆ యువతి తండ్రి దీన్ని జీర్ణించుకోలేక ఆ యువకుడిని రైల్వే ట్రాక్ పై చంపేసి పడేశారు అనేది అప్పట్లో పెద్ద వాదన. ఆ ఇళవరసన్ పట్టాలపై శవమై తేలటాడు. 2012 నవంబర్ నెలలో ఇది తమిళనాడులోని ఒక సంచలన ప్రేమ కథ. కట్ చేస్తే..
సీన్ 3 ; మరో దళిత యువకుడు పేరు గోకుల్ రాజ్ తమిళ దొరల అమ్మాయిని ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకుంటాడు. ఆమె తండ్రి జీర్ణించుకోలేక ఈ యువకుడిని చంపేసి… చాలా రోజుల తర్వాత పోలీసులకు లొంగిపోతాడు. ఇది తమిళనాడులో మరో సంచలన ప్రేమకథ. దీనిపై సీఐడీ నుండి సీబీఐ వరకు వెళ్ళింది. ఇక కట్ చేస్తే.. నిన్న మొన్నటి విషయానికి వస్తే.. ఓ దళిత ఎమ్మెల్యే వయస్సు 39.. బ్రాహ్మణ యువతి వయస్సు 19. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది ఆ యువతి కుటుంబానికి ఏ మాత్రం ఇష్టం లేదు. ఆ కథ కోర్టు వరకూ వెళ్ళింది. మరి మనం ముందు చెప్పుకున్న కులాంతర వివాహాల్లాగా ముగుస్తుందా? లేదు సుఖాంతం అవుతుందా? అనేదే ప్రస్తుతం పెద్ద ప్రశ్న.
అంతా సుఖాంతం వైపుగానే..!!
ప్రస్తుతం అయితే ఈ కథ సుఖాంతం వైపునే ఉంది. ఆ ఎమ్మెల్యే సంగతి పక్కన పెడితే.. ఆ యువతి కుటుంబమే ఇప్పుడు పట్టుదలతో ఉంది. కోర్టుకి వెళ్ళింది. ఆమె మైనర్ అని, వివాహం చెల్లదు అని చెప్తున్నారు. ఇక్కడ ఆమె కీలకం. ఆ యువతి ఏం చెప్తుంది, కోర్టు ముందు వాదన ఎలా వినిపిస్తుంది..? ఆమె మేజర్ అని నిరూపించుకుంటుందా..? అనేది కీలకం. “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక సోర్సుల ద్వారా తమిళనాడులోని ఈ విషయంపై ఆరా తీయగా..!! ఆయన హేవియస్ కార్పస్ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె కూడా తన భర్తకు మద్దతుగా నిలబడేందుకు వాదనలు సిద్ధం చేస్తున్నారు. ఆమె మేజర్ అని ధ్రువీకరణ సెర్టిఫికెట్లు కూడా తీసి పెట్టుకున్నారు. కోర్టులో వీరి వాదనలు స్పష్టంగా ఉండబోతున్నాయి. పైగా ఆమె తండ్రి కూడా నిస్సహాయతతో దారిలోకి వస్తున్నట్టు చెప్తున్నారు. సో.., ఈ కథ సుఖాంతం వైపు అడుగులు వేస్తుంది..!!