అచ్చెన్నాయుడుని అవినీతి కేసులో అరెస్టు చేసారు…!
కొల్లు రవీంద్రని హత్య కేసులో నిన్న రాత్రి అరెస్టు చేసారు…!
అయ్యన్న పాత్రుడుపై నిర్భయ కేసు నమోదు చేసారు..!
యనమల రామకృష్ణుడు, చిన్నరాజప్పపై అట్రాసిటీ కేసు నమోదు చేసారు..!
అంటే ఇప్పటికి అయిదుగురు మాజీ మంత్రులపై కేసులు నమోదయ్యాయి. ఇంకా ఈ జాబితాలో మరికొంత మంది మంత్రులు ఉన్నారు. దేవినేని ఉమా.., నారా లోకేష్.., పితాని సత్యన్నారాయణ.., తదితరులపై కూడా త్వరలోనే నమోదు చేయనున్నారని వినికిడి. అందుకే టిడిపిలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.
మానసికంగా సిద్ధమవుతున్నారు…!
టీడీపీలో చురుగ్గా ఉన్న నాయకులు ఇప్పుడు తాము అధికారంలో ఏం చేశామా అనేది గుర్తు చేసుకుంటున్నారు. నాడు ఏదైనా తప్పు చేసి ఉంటె.. కచ్చితంగా ఇప్పుడు దొరికిపోతాము… జైలుకు వెళ్లడం ఖాయం అంటూ మానసికంగా సిద్ధమైపోతున్నారట. అందుకే ముందుగానే అందుకు తగిన న్యాయ సలహాలు తీసుకుంటూ, అరెస్టులు కాకుండా ముందస్తు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారట. ఇటీవల అచ్చెన్నాయుడు కుటుంబాన్ని పరామర్శించే సమయంలో మాజీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు పరిశీలిస్తేనే అర్ధమవుతుంది.. “ఐటిలో కుంభకోణం జరిగిందట, అందులో మంత్రికి ఏం సంబంధం” అంటూ భుజాలు తడుముకున్నారు. అంటే మానసికంగా ఎంతగా సిద్దమయ్యారో తెలుస్తుంది.
ప్రతి జిల్లా నుండి అప్రమత్తం…!
ఇక ప్రతి జిల్లా నుండి టీడీపీ నేతలు ఎవరెవరు అరెస్టు కాబోతున్నారో..? ముందుగానే ఒక అంచనాకు వస్తున్నారట. “న్యూస్ ఆర్బిట్” తో ఓ టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ “జిల్లాకు ఇద్దరు నేతలను అరెస్టు చేస్తారని సమాచారం ఉంది. కీలకంగా ఉన్న వారిని జైలులో పెడతారు. పెడితే మాకే మంచిది. బయటకు రాకుండా అక్కడే ఉండిపోము కదా, వచ్చాక నిజాలు తెలియజేస్తాము. అలా ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, ప్రభుత్వానికే మచ్చ. గతంలో తమిళనాడులో జయలలిత సీఎం గా ఉండగా కరుణానిధి సహా ఆ పార్టీ ముఖ్య నాయకులు అందర్నీ జైల్లో పెట్టించారు. ఆ తర్వాత ఎన్నికల్లో జయలలిత తుక్కు తుక్కుగా ఓడిపోయారు” అంటూ చెప్పుకొచ్చారు. ఇదీ సంగతి. అరెస్టులు విషయంలో తెలుగుదేశం పార్టీ ఇలా సిద్ధమై ఉండగా, వైసిపి మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే విధంగా ఉంది.