అగ్రరాజ్యం అమెరికాలో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. క్యాపిటల్ బిల్డింగ్పైన ట్రంప్ మద్దతుదారులు దాడి చేసి నానా గొడవ చేశారు. ట్రంప్ మద్దతుదారులు ఆ పనిచేయడానికి కారణం అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ రెచ్చగొట్టే కామెంట్స్ చేయడమేనని అప్పట్లో ఒక దుమారమే రేగింది. దీనికి ఆయన చేసిన ట్వీట్లే దానికి కారణం అని పలువురు విమర్శించారు.
అమెరికాలోని క్యాపిటల్ భవనంలో జరిగిన హింసాత్మక ఘటనల పట్ల ట్రంప్ వ్యవహరించిన తీరుకు సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై తొలుత కొన్ని గంటలు తర్వాత పూర్తిగా నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని 45 ఏళ్ల భారత సంతతి మహిళ, ట్విట్టర్ లాయర్ విజయ గద్దె తీసుకున్నారని సమాచారం.
గత శుక్రవారం, మొదటిసారిగా ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ ను శాశ్వతంగా బ్లాక్ చేశారు. కొన్ని రోజులుగా ఆయన చేసే ట్వీట్లను ట్విట్టర్ యాజమాన్యం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అవన్నీ కూడా ఉద్రిక్తతలకు ప్రేరేపించేలా ఉన్నాయని తేల్చింది. పరిస్థితులు చేయి దాటకముందే ఆయన ఖాతాను ట్విట్టర్ యాజమాన్యం పూర్తిగా బ్లాక్ చేసేసింది.
దీనిపై లీగల్, పాలసీ, ట్రస్ట్ అండ్ సేఫ్టీ ఇష్యూస్కు హెడ్గా వ్యవహరిస్తున్న విజయ గద్దె ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేసింది. ట్రంప్ చేసే ట్వీట్లు మరింత హింసకు ప్రేరేపించే ప్రమాదం ఉన్నందువల్లే ట్రంప్ ఖాతాను నిలిపివేశామని పేర్కొంది. మా సంస్థ నిర్ణయంపై మరింత లోతుగా తెలుసుకోవచ్చని కూడా తెలిపింది.
చిన్నప్పుడే భారతదేశం నుంచి అమెరికాకు వచ్చేసిన విజయ గద్దె.. న్యూయార్క్ యూనివర్శిటీ లా స్కూల్ నుంచి తన గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసింది. మొదట్లో పలు స్టార్టప్ కంపెనీల్లో పని చేసింది. 2011లో ట్విట్టర్ సంస్థలో కార్పోరేట్ లాయర్గా బాధ్యతలు తీసుకుంది.దశాబ్ద కాలంలో ట్విట్టర్ మంచి స్థాయికి పోవడంలో ఆమె పాత్ర కూడా ఉందని చెప్పొచ్చు.