వినియోగాదారులకు డబ్బులు కావాలంటే బ్యాంకులకు లేదా ఏటీఎంలకు తప్పని సరిగా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్లినా.. ఒక్కోసారి జనం రద్దీ కారణంగానో.. లేదా బ్యాంకు సర్వర్లు పనిచేయక పోవడంతోనూ చాలా సమయం వృధా అవుతుంది. ఇక ఏటీఎంల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ! ఎందుకంటే చాలా ఏటీఎంలు ఉంటాయి.. కానీ అందులో డబ్బులు లేని సందర్బాలు అధికమే! ఉన్నప్పటికీ పలు సాంకేతిక కారణాల వల్ల మనీ కూడా బయటకు రాదు.. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న బ్యాంకు ఖాతాదారులు అధికంగానే ఉండి ఉంటారు !
ఇలాంటి సమస్యలు ఇప్పుడు ఎదుర్కోవాల్సిన పని ఉండదు. కేవలం ఒక్కఫోన్ కాల్తో మీ డబ్బు మీ చేతిలోకి వస్తుంది. అవునూ నిజమే ! మీరు చదివింది అక్షర సత్యం. అయితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఆంధ్రబ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని ఖాతాదారులకు మాత్రమే ఈ సౌకర్యం ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీని కోసం ఆయా బ్యాంకులు ‘‘డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసు’’లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతో కస్టమర్లకు పలు సమస్యల నుంచి భారీ ఊరట లభించనుంది.
ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డోర్ స్టెప్ బ్యాకింగ్ సర్వీసులను తన చేతుల మీదుగా ప్రారంభించారు. దేశంలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలోనే సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఈ సేవలను అక్టోబర్ 1 నుంచే అందుబాటులోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతమైతే ఈ సేవలు వికలాంగులు, సీనియర్ సిటిజన్స్ కు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీని కోసం కస్టమర్లు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్ లో ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ సర్వీసులు అందిస్తున్నారు. చెక్, డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకెళ్లడం, అకౌంట్ స్టేట్మెంట్, కొత్త చెక్ బుక్ పొందటం, టర్మ్ డిపాజిట్ రశీదు పొందటం, ఫామ్ 16 అందజేత, క్యాష్ డిపాజిట్, విత్డ్రా చేసుకోవడం వంటి సేవలు లభిస్తాయి. ఇంటి వద్దే అందిస్తున్న ఈ సర్వీసులకు ఆయా బ్యాంకులు రూ. 50 నుంచి 200 రూపాయల వరకూ చార్జీలు వసూలు చేస్తున్నాయి.