చైనాలోని హ్యాంగ్జౌ ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి విపరీతమైన ఆకలి, విరేచనాలు, అలసట, కడుపు నొప్పితో హాస్పిటల్లో చేరాడు. అతడికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు, రిపోర్టులు చూసి షాకయ్యారు. ఎందుకంటే, అతడి కాలేయం సగం మాత్రమే ఉంది. ఎందుకలా జరిగిందని మరింత లోతుగా పరిశీలిస్తే..
దాన్ని ఓ పరాన్నజీవి (పురుగులాంటి జీవి) ముక్కలు చేసుకుని తినేస్తూ కనిపించింది. దీంతో వైద్యులు అతడికి వెంటనే చికిత్స మొదలుపెట్టారు. అసలు ఏమి జరిగిందంటే ఇటీవల ఆరోగ్య పరిస్థితి మరింత దారుణంగా తయ్యారవడంతో అతడు హస్పిటల్కు వెళ్లాడు. అతడి కాలేయాన్ని పరిశీలించిన వైద్యులు.. ఆశ్చర్యపోయారు. కాలేయం సగం మాయమవ్వడమే కాకుండా అందులో 19 సెంటీ మీటర్ల పొడవు, 18 సెం.మీ. వెడల్పు ఉన్న చీము గడ్డ కనిపించింది. దాని చుట్టు పెద్ద పెద్ద గడ్డలు కూడా ఏర్పడటం మొదలైంది. గడ్డలను మరింత సూక్ష్మంగా పరిశీలించగా.. అది ప్లాట్ వార్మ్స్ (టేపులా ఉండే పురుగులు) అనే పరాన్నజీవుల వల్ల ఏర్పడినట్లు తెలుసుకున్నారు. దీంతో వెంటనే చికిత్స మొదలుపెట్టారు.
గడ్డల్లోని చీమును సగం వరకు తొలగించారు. తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులు కాలేయాన్ని కూడా కొంతవరకు తొలగించాల్సి వచ్చింది. వాటిలో బల్బుల తరహాలో ఉన్న చిన్న చిన్న పరాన్నజీవి గుడ్లు ఉన్నాయని వైద్యులు తెలిపారు.ఈ సందర్భంగా బాధితుడు వైద్యులకు కొన్ని షాకింగ్ విషయాలు చెప్పాడు. అతడు ఆకలి వేసినప్పుడు చేపలను ఉడక బెట్టకుండా పచ్చిగా తింటానని తెలిపాడు. దీంతో వైద్యులకు అతడి సమస్య అర్థమైంది. చేపల్లో కంటికి కనిపించని పరాన్నజీవులు ఉంటాయి. వాటిని పచ్చిగా తిన్నప్పుడు.. వాటిలో ఉండే పరాన్నజీవులు, బ్యాక్టీరియా కూడా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అవి శరీరంలోనే గుడ్లు పెట్టి తమ సంతానాన్ని పెంచుకుంటాయి. శరీర అవయవాలను కొరుక్కు తింటూ క్రమేనా అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. బాధితుడి విషయంలో కూడా ఇదే జరిగింది. మరి, ఈ చైనావాళ్లు ఎప్పటికి మారతారో!