పుట్టగొడుగులు.. పుష్కలమైన పోషకాలను కలిగిన వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. వీటిలో విటమిన్ బీ, డీ సహా మరిన్ని అధికంగానే ఉంటాయి. మష్రూమ్ లను ఆహారంగా తీసుకోవడంతో శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడం, ఊబకాయం తగ్గించడంతో పాటు ప్రాణాంతకమైన మధుమేహం, క్యాన్సర్ వంటి రోగాల నుంచి కొద్దిమేర ఉపశమనం కలిగించడంలో పుట్టగొడుగులు కీలక పాత్ర పోషిస్తాయని పలు అధ్యయనాలు సైతం తేల్చాయి.
అయితే, యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19) కట్టడి కోసం పలు దేశాల్లో టీకా తయారీ కోసం విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పలు కరోనా వ్యాక్సిన్లు చివరి దశ పరీక్షలకు సైతం చేరాయి. అయితే, ఎన్ని రకాలుగా కరోనానను కట్టడి చేయడం వీలవుతుందో అన్నింటిపైనా శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనాకు చెక్ పెట్టడంలో పుట్టగొడుగులు కీలకంగా ఉన్నాయంటూ హైదరాబాద్కు చెందిన సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) వెల్లడించింది.
పూర్తి స్థాయిలో మెరుగైన ఫలితాలిచ్చే కరోనా టీకా అందుబాటులోకి రావడానికి చాలా సమయంతో పాటు పరిశోధనలు సైతం మరింత లోతుగా చేయాల్సిన ఉన్న తరుణంలో.. ఈ మహమ్మారి కట్టడి కోసం పలు సంస్థలు యాంటీ వైరల్ ఔషధ ఆహారంపై పరిశోధనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అంకుర సంస్థ క్లోన్ డీల్స్, సీసీఎంబీలు సంయుక్తంగా పరిశోధనలు కోనసాగించాయి. పుట్టగొడుగుల్లోని పోషకాలు, అధికంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, బీటా గ్లూకాన్స్, యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు కరోనాకు చెక్పెట్టగలవని తమ పరిశోధనలో గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.
కరోనా మహమ్మారికి చెక్ పెట్టగల ఈ పుట్టగొడుగులతో చేసిన యాంటీ వైరల్ ఔషధాన్ని తక్షణ విరుగుడుగా తీసుకోవచ్చునని పరిశోధకులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి పరిశోధనలు ముగిశాయనీ, త్వరలోనే దీనిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నమని తెలిపారు. అంకుర సంస్థ క్లోన్ డీల్స్, సీసీఎంబీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనాకు చెక్పెట్టే ఈ ఫుడ్ సప్లిమెంట్ను.. ప్రముఖ ఔషధ ఆహార ఉత్పత్తుల సంస్థ అయిన ఆంబ్రోషియా ఫుడ్ ఫామ్తో కలిసి దీనిని ఉత్పత్తి చేస్తామని పరిశోధకులు తెలిపారు. ద్రవరూపంలో ఉంగే ఈ సప్లిమెంట్ వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్నదని తెలిసింది.