గత కొద్ది నెలల కాలం నుంచి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా విషయంలో ప్రతి రోజూ ఓ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. మొదట కరోనా సోకితే తీవ్రమైన జ్వరం,దగ్గు,జలుబు వంటి లక్షణాలతో పాటు వాసన కోల్పోవటం వంటి ఉండేవని పరిశోధకులు తెలియజేశారు. కానీ తాజా పరిశోధనలో మరొక కొత్త లక్షణం బయటపడిందని స్పెయిన్ పరిశోధకులు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
సాధారణంగా కరోనా రాగానే తీవ్రమైన జ్వరం రుచి తెలియకపోవడం,దగ్గు జలుబు వంటి ప్రాథమిక లక్షణాలతో పాటు కొందరిలో మానసిక గందరగోళం(డేలిరియం) వంటి లక్షణాలు ఏర్పడుతున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఈ మానసిక గందరగోళానికి గురైన వ్యక్తి వాస్తవాలను గుర్తించే శక్తిని కోల్పోవడంతో పాటు, తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారని పరిశోధకులు తెలియజేస్తున్నారు.
కరోనా వైరస్ సోకిన వ్యక్తి శరీరంలోని అన్ని అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో పాటు, కేంద్ర నాడీ వ్యవస్థను కూడా దెబ్బతీస్తోందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఫలితంగా వారి మానసిక స్థితి లో గందరగోళం ఏర్పడుతుంది. అంతేకాకుండా కరోనా వ్యాధి ప్రారంభ దశలో జ్వరంతో పాటు, మానసిక అసమతుల్యత ఏర్పడుతుందని స్పెయిన్లోని ఒబెర్టా డి కాటలోనియా యూనివర్సిటీకి చెందిన జేవియర్ కొర్రియా తెలిపారు.
డెలీరియం లక్షణం ఎక్కువగా వయసులో ఉన్న వారి కన్నా వయసుమళ్ళిన వారిపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. వయసు మళ్ళిన వారు తీవ్రమైన జ్వరంతో పాటు ఈ మానసిక గందరగోళానికి గురి అయితే వారు కరోనాతో బాధపడుతున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు రావచ్చని తెలియజేశారు. ఈ అధ్యయనం తాలూకు వివరాలు క్లినికల్ ఇమ్యునాలజీ, ఇమ్యూనో థెరపీ జర్నల్లో ప్రచురితమయ్యాయని ఈ సందర్భంగా తెలియజేశారు. వయసు మళ్ళిన వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉండటంతో పెద్దవారు వీలైనంత వరకు తగు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు తెలియజేస్తున్నారు.