షుగర్ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం మనతోనే ఉంటుంది. నేటి కాలంలో చిన్నా.. పెద్ద అని తేడా లేకుండా అందరికీ ఈ వ్యాధి వస్తోంది. కొన్ని ఆహార నియమాలతో పాటు కొంత జాగ్రత్త తీసుకుంటే దీనినుండి రక్షణ కల్పించుకోవచ్చు.
అలాగే ఈ వ్యాధి ఉంటే ఏం తినాలన్నా కాస్త భయపడుతూ ఉంటారు. ఇందులో భాగంగా.. కొందరు షుగర్ పేషెంట్లు గుడ్డు తినడానికి సంకోచిస్తారు. కాని, మధుమేహం ఉన్నవారికి గుడ్డు ఒక మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు. ఉదయం తినే అల్పాహారంలో గుడ్డు తింటే, డయాబెటిస్తో పాటు మరికొన్ని ఇతర సమస్యలు కూడా తొలగిపోతాయి. ఒక గుడ్డులో అర గ్రాము కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ మరియు ప్రిడియాబయాటిస్ ఉన్న రోగులకు వారానికి పన్నెండు గుడ్లు తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.
అలాగే గుడ్డు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ను తగ్గిస్తుంది. అంతేకాదు, గుడ్డు షుగర్ పేషెంట్లకే కాదు.. అందరికీ మంచిదే. అన్ని వయసుల వారికి కావాల్సిన పోషకాలూ ఇందులో ఎక్కవుగా ఉంటాయి. గుడ్డులో అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్, అయోడిన్, సెలీనియం, ఐరన్, జింక్ ఉంటాయి. ఇవన్నీ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే గుడ్డులో విటమిన్ ఏ కూడా ఉంటుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక సూర్యరశ్మి ద్వారా శరీరానికి విటమిన్ డీ లభిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గుడ్డు ద్వారా కూడా విటమిన్ డీ పొందవచ్చు. కాబట్టి, ఎండలో తిరగలేని వారు ఖచ్చితంగా రోజుకో గుడ్డు తీసుకోమని నిపుణులు చెబుతున్నారు.