ప్రతి మనిషికీ సరాసరి ఏడుగంటల నిద్ర తప్పనిసరి అని మనందరికీ తెలిసిందే . ఇది ఒక గంట అటో, ఇటో అయినా పెద్ద పర్వాలేదు.అయితే మీకు నిద్ర సరిపోతుందా లేదా తెలుసుకునేందుకు ఒక్కటే మార్గం. నిద్ర లేచిన తర్వాత ఇంక రోజంతా మీకు నిద్ర రాకూడదు, నిద్ర పోవాలనిపించకూడదు, కునుకు తియ్యాలని కూడా అనిపించకపోతే మీకు నిద్ర సరిపోతున్నట్టు. అయితే, ఎంత సమయం నిద్ర పోతున్నారు అన్న విషయంతో పాటూ, ఎలాంటి సమయం లో నిద్రపోతున్నారు అనేది కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.
ఉదాహరణకి, ఒక వ్యక్తి ఏడు గంటలు నిద్రపోతారనుకుందాం. రాత్రి పదింటికి నిద్రపోయి తెల్లవారి ఐదుగంటలకి లేవడం ఒక లెక్క. రాత్రి పన్నెండింటికి నిద్రపోయి పొద్దున్న ఏడుగంటలకి లేవడం ఇంకో లెక్క. అర్ధరాత్రి రెండింటికి పడుకుని పొద్దున్న తొమ్మిదింటికి లేవడం, తెల్లవారుజామున నాలుగింటికి పడుకుని పొద్దున్న పదకొండింటికి లేవడం ఇంకో లెక్క. అన్ని సందర్భాలలోనూ నిద్రపోయిన సమయం ఏడుగంటలే. కానీ, రోజులో ఏ సమయంలో నిద్ర పోయారనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. సూర్యోదయానికీ, మనం నిద్రలేచిన సమయానికీ దూరం పెరుగుతున్న కొద్దీ మనం అనారోగ్యానికి దగ్గర అవుతున్నామన్నది నిజం. నిద్ర పై జరిపిన పరిశోధనలో 1684 టీనేజ్ పిల్లలు పాల్గొన్నారు. వారిని ఏ టైమ్కి పడుకుంటారు? ఏ టైమ్కి లేస్తారు? ఏ టైమ్లో చురుగ్గా ఉంటారు? రోజులో ఏ టైమ్లో అలసటగా అనిపిస్తుంది? ఏ టైమ్లో చదువుకుంటే బాగా అర్ధమవుతుంది ? లాంటి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఈ ప్రశ్నలతో పాటు వారు గురక పెడతారా, ఆస్థ్మా ఉందా, తుమ్ములు, జలుబు ఎక్కువగా ఉంటాయా అని కూడా అడిగారు. వీటితో పాటూ పరిశోధకులు ఈ టీనేజ్ పిల్లలు జీవిస్తున్న పరిసరాలను, పరిస్థితుల వివరాలను కూడా సేకరించారు. అంటే, వారి ఫ్యామిలీలో ఎవరైనా స్మోక్ చేస్తారా లాంటి విషయాలు వంటివి.
ఈ వివరాలన్నీ పోల్చి చూస్తే, లేట్గా పడుకుని లేట్గా లేచే టీనేజర్లలో ఆస్థ్మా, అలెర్జీలు వచ్చే అవకాశం మిగిలిన వారి కన్నా మూడు రెట్లు అధికంగా ఉందని తెలిసింది. ఎందుకంటే పొద్దున్న లేట్గా లేచినప్పుడు మన బాడీ క్లాక్ కన్ఫ్యూజ్ అవుతుంది. దీనివల్లే ఇలాంటివి వచ్చే అవకాశం పెరిగిందనుకోవచ్చు. రాత్రిపూట త్వరగా నిద్రపోవటం, తెల్లవారుజామునే లేవటం, సూర్యోదయాన్ని చూడటం, వెలుతురును ఆస్వాదించటం ఇవి చేయదగిన పనులు. వీటివలన దేహపుష్ట, మనోబలం పెరుగుతాయి. తెల్లవారుజామునే నిద్ర లేవండి అని చెప్పడానికే ఈ పరిశోధన.