నోరుంది కదా అని ఇష్టానుసారం మాట్లాడటం, గొడవలు పడటం, అవాకులు చెవాకులు పేలడం సరికాదు. కొందరు అవసరం లేకపోయినా గోరంతలు, కొండంతలు చేసి గొడవలు సృష్టించి అనవసరంగా అందరినీ విసిగించి నోరు పారేసుకుంటారు. వారికి దురుసుగా మాట్లాడందే నోటిదురద తీరదు.
ఇది చాలా ప్రమాదకరం. ఎవరైనా ఎదురుపడితే, ఆత్మీయంగా బాగున్నారా? అని అడిగితే, ఆ ఒకే ఒక్కమాట వల్ల ఇద్దరి మధ్యా ఆత్మీయత ఏర్పడుతుంది. ఎదుటి వ్యక్తికి మనపై సదభిప్రాయం ఏర్పడుతుంది.
అలాగే.. కష్టనష్టాల్లో ఉన్న వ్యక్తిని ఆదరంగా పలకరిస్తే, ఆ మాటలు అతనికి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఎవరైనా మనల్ని చక్కగా పలకరిస్తే మనం ఎంత ఆనందిస్తామో, మనం కూడా ఇతరులను అదే విధంగా పలకరించాలి. కాలుజారినా ప్రమాదం లేదు గానీ, నోరు జారితే ఎంతో ప్రమాదం. ఱంపంతో తో సగానికి కోసినప్పుడు పడే బాధకంటే..
నోరుజారి మనస్సును గాయపరిచినప్పుడు ఎక్కువ బాధ కలుగుతుంది.అందుకే నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు జారరాదు. అందుకేనోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు మన పెద్దలు.
దేవుడు ఇచ్చిన నోటితో దైవ నామాన్ని పలకాలి, కీర్తించాలి. పది మంది మేలు కోరుకోవాలి. అంతే కానీ.. అనరాని మాటలు మాట్లాడి, నోటికి కల్మషం అంటించరాదు. నోటిని అపవిత్రం చేయరాదు. నోటితో మంచి పలుకులే పలకాలి, ఆ పలుకులు ఇంపుగా ఉండాలి. మాట్లాడే మాటలపై మనకు అదుపు ఉండా లి. ఎందుకంటే మాటలలోనే మర్మం ఉంది. మాటలలోనే సర్వం ఉంది.ఎంతో బాధలో ఉన్నవాళ్ళకి మాటే మంత్రమవుతుంది.మంచి మాటలను మాట్లాడితే వాక్ శుద్ధి కలుగుతుంది.